అంతర్జాతీయ సమాజానికి చేరువయ్యేందుకు... రైతు సంఘాల 'గ్లోబల్ వెబినార్...'
రైతు ఉద్యమాన్ని మరింతగా అంతర్జాతీయ సమాజ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 25) సంయుక్త కిసాన్ మోర్చా 'గ్లోబల్ లైవ్ వెబినార్'ను నిర్వహించనుంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టంపై ఈ వెబినార్లో చర్చించనున్నారు. రైతు సంఘాల నేతలు ఈ వెబినార్లో పాల్గొని తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజంతో పంచుకోనున్నారు.
గత రెండు నెలలకు పైగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై ఇప్పటికే అంతర్జాతీయ సమాజం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. పాప్ స్టార్ రిహన్నా,పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్,కెనడా ప్రధాని ట్రూడో తదితరులు రైతులకు మద్దతు తెలిపారు. అయితే అంతర్జాతీయంగా వచ్చిన ఈ మద్దతు పట్ల దేశంలో తీవ్ర చర్చ జరిగింది. భారతరత్న సచిన్ టెండూల్కర్ సహా పలువురు సెలబ్రిటీలు ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని.. బయటి వ్యక్తుల జోక్యం తగదని సున్నితంగా వారించారు. మరికొందరు సెలబ్రిటీలు మాత్రం వారి మద్దతుపై హర్షం వ్యక్తం చేశారు.
కాగా,వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మూడు చట్టాలను తాత్కాలికంగా ఏడాదిన్నర పాటు పక్కనపెడుతామని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రైతులు మాత్రం ఆ చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండాగా పోరాడుతున్నారు. రైతులు-కేంద్రం మధ్య నెలకొన్న ఈ ప్రతిష్ఠంభనకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించట్లేదు.
ఇక శుక్రవారం(ఫిబ్రవరి 26) నాటి భారత్ బంద్కు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా బంద్కు మద్దతునివ్వాలని... ప్రశాంత వాతావరణంలో బంద్ జరిగేందుకు సహకరించాలని పిలుపునిచ్చాయి. జీఎస్టీ నిబంధనలు సమీక్షించాలన్న డిమాండుతో పాటు పెరుగుతున్న గ్యాస్,పెట్రోల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్త బంద్కు అఖిలభారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది. దాదాపు 40వేల వాణిజ్య సంఘాలు బంద్లో పాల్గొంటున్నట్లు తెలిపింది.బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.