రైతులు ఉప్పెనలా ఉద్యమిస్తున్న వేళ... కర్ణాటక మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు..
వేలాదిమంది రైతులు ఒక ఉప్పెనలా ఢిల్లీకి పోటెత్తి ఉద్యమిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా ఢిల్లీని దిగ్బంధించారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు లాఠీచార్జీలు,టియర్ గ్యాస్లు ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు వారిని చర్చలకు పిలిచింది. ఇప్పటికే ఓ దఫా చర్చలు విఫలం కాగా.. తాజా చర్చల్లోనైనా పురోగతి లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఇలా దేశమంతా రైతు ఆందోళనలపై చర్చ జరుగుతున్నవేళ... కర్ణాటక మంత్రి,బీజేపీ నేత బీసీ పాటిల్ రైతులను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మంత్రి బీసీ పాటిల్ ఏమన్నారు...
ఆత్మహత్యలకు పాల్పడే రైతులంతా పిరికివాళ్లని.. భార్య,పిల్లలను పోషించలేని పిరికివాళ్లే ఆత్మహత్యలకు పాల్పడుతారని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనం నీళ్లలో పడిపోతే.. ఎలాగైనా సరే ఈదుకుంటూ ఒడ్డును చేరుకోవాలన్నారు. వ్యవసాయం ఎంతో లాభసాటిదని... కానీ కొంతమంది పిరికివాళ్లు పిరికివాళ్లు ఆ విషయాన్ని గ్రహించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేట్లో ఏర్పాటు చేసిన ఓ సభలో బీసీ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి చెప్పిన ఉదాహరణ...
ఈ సందర్భంగా మంత్రి పాటిల్ రైతులకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. 'చేతుల నిండా బంగారు గాజులు ధరించిన ఓ మహిళను.. ఆమెకు అవి ఎలా వచ్చాయని నేను ఆరా తీశాను. ఆమె ఏం చెప్పిందో తెలుసా... తల్లి లాంటి ఈ భూమి నా 35ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిందని చెప్పింది. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఓ మహిళ ఇంత సాధించగలిగితే... మిగతా రైతులు మాత్రం ఎందుకని వెనుకబడిపోతున్నారు.' అని పాటిల్ ప్రశ్నించారు.
క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్...
మంత్రి బీసీ పాటిల్ రైతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీఎస్ ఉగ్రప్ప ఖండించారు. మంత్రి పాటిల్ రైతు లోకాన్ని అవమానపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇందుకు ఆయన తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఏ రైతు చేజేతులా తన జీవితానికి ముగింపు పలకాలని కోరుకోడు. వరదలు,కరువు,ఇలా ఇతరత్రా ఎన్నో సమస్యలు రైతులకు ప్రతిబంధకంగా ఉన్నాయి. రైతు సమస్యలను మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోకుండా ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడమేంటి..?' అని బీసీ పాటిల్ మండిపడ్డారు.
ఆ వీడియో మ్యానిపులేట్...
ఢిల్లీ కేంద్రంగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రోజుల తరబడి రైతులు రోడ్లపై ఆందోళన చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా నిజాలను కప్పి పుచ్చేలా బీజేపీ ఐటీ సెల్ రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ ఫోటోను మ్యానిపులేట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల లాఠీచార్జీలో దెబ్బలు తిన్న ఓ వృద్ద సిక్కు రైతుకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫేక్ అని.. అసలు పోలీస్ లాఠీ ఆ రైతుకు తాకనే లేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ట్విట్టర్ దీన్ని 'మ్యానిపులేటెడ్ వీడియో' అని తేల్చింది. దీంతో రైతులపై కూడా అబద్దపు ప్రచారాలు చేస్తారా అని జనం మండిపడుతున్నారు. బీజేపీ రైతుల పట్ల అనుసరిస్తున్న ధోరణిని విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.