పేదల కోసం న్యాయ్ , రైతులకు ప్రత్యేక బడ్జెట్, కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్ గాంధీ
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సారథ్యంలో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల మన్నన పొందేలా హమ్ నిభాయేంగే పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, చిదంబరం మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ రాజీవ్ గౌడ తదితరలు పాల్గొన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది. పార్టీ గుర్తు హస్తానికి ఉండే ఐదు వేళ్లు ప్రతిబింబించేలా కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఐదు అంశాలకు ప్రయారిటీ ఇచ్చింది. పేదలకు ఆర్థిక భరోసా, యువతకు ఉపాధి కల్పన, రైతు సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, జాతీయ భద్రత తదితర అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ మరోసారి హామీ ఇచ్చారు.
అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!
పేదల కోసం న్యాయ్
దేశంలో 2030నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రధాని మోడీ హయాంలో భ్రష్టు పట్టుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కనీస ఆదాయ పథకం ద్వారా దేశంలోని 20శాతం ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.72 వేల రూపాయలు జమ చేయనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఐదేళ్లలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,60,000 వేసి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని మాట ఇచ్చింది.
యువతకు ఉపాధి కల్పన
అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ చేసిన బూటకపు వాగ్దానాల్లా తాము హామీలివ్వమని కాంగ్రెస్ స్పష్టంచేసింది. ప్రస్తుతం భారత్లో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2020 మార్చికల్లా 22 లక్షల సర్కారీ కొలువు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. వీటితో పాటు గ్రామ పంచాయితీల్లో 10 లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక యువ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే లక్ష్యంతో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వారు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కల్పించనున్నట్లు చెప్పింది. మూడేళ్ల వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని రోజుల్ని 150కి పెంచనున్నట్లు రాహుల్ ప్రకటించారు.
రైతులకు ప్రత్యేక బడ్జెట్
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అన్నదాతల కోసం ప్రత్యేకంగా రైతు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. రైతులు సకాలంలో అప్పులు చెల్లించలేని పక్షంలో ప్రస్తుతం బ్యాంకులు వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని సివిల్ కేసులుగా పరిగణించేలా చట్టసవరణ చేస్తామని హామీ ఇచ్చింది.
విద్యా కోసం జీడీపీలో 6శాతం
విద్య, వైద్యం తదితర అంశాలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చింది. జీడీపీలో 6శాతాన్ని విద్యా రంగం అభివృద్ధికి ఖర్చుచేయనున్నట్లు చెప్పింది. అందిరికీ నాణ్యమైన విద్య అందేలా చూడటమే తమ ధ్యేయమని స్పష్టంచేసింది. ఇక ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రైవేటు హాస్పిటళ్లకు ఆదాయం సమకూర్చే బీమా పథకాల జోలికి వెళ్లమని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచి, నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందేలా చూస్తామని స్పష్టంచేసింది.
భద్రతకు పెద్దపీట
గత ఐదేళ్లలో మోడీ సర్కారు దేశాన్ని విభజించి, విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేసిందని రాహుల్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తామని స్పష్టంచేసింది.