వ్యాలీ నుంచి కాశ్మీరీ పండిట్ల బహిష్కరణపై సుప్రీం జడ్జీలతో దర్యాప్తు జరపాలి: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: 1990లలో వ్యాలీ నుంచి కాశ్మీరీ పండితులను వెళ్లగొట్టిన ఘటనలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలతో విచారణ జరిపించాలని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కాశ్మీరీ పండితులు లేకుండా కాశ్మీర్ పరిపూర్ణం కాదని అన్నారు. ఇక్కడ్నుంచి వెళ్లిపోయిన కాశ్మీరీ పండితులను గౌరవంగా తిరిగి రప్పించేందుకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.
మిలిటెంట్ల బెదిరింపులు, దాడుల కారణంగా 1990లలో కాశ్మీర్ వ్యాలీ నుంచి వెళ్లిపోయిన సుమారు 60వేల కాశ్మీరీ పండితులు వలసదారులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఎంపీ అయిన అబ్దుల్లా ఈ విషయంలో మాజీ గవర్నర్ జగ్మోహన్పై నిందలు వేశారు. మూడు నెలల్లోనే కాశ్మీరీలను తిరిగి తీసుకొస్తామన్న ఆయన.. ఆ పని చేయలేదని ఫరూక్ ఆరోపించారు.
"పాత ఆర్డర్ను కొత్త ఆర్డర్ను వివరిస్తుంది - ఆర్టికల్ 370 యొక్క తటస్థీకరణ మరియు ఆర్టికల్ 35 ఎ రద్దు చేసిన ఒక సంవత్సరం తరువాత", అనే అంశంపై స్థానిక ఓ మీడియా సంస్థ నిర్వహించిన వెబినార్ సదస్సులో పాల్గొన్న అబ్దుల్లా మాట్లాడారు. వలసదారులకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ఓ కాశ్మీరీ పండిట్ సంస్థకు మీరు మద్దతు పలుకుతారా? జెనోసైడ్ బిల్లుకు మద్దతు తెలుపుతారా? అని ప్రశ్నించగా.. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని అన్నారు.
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన అబ్దుల్లా మాట్లాడుతూ.. నిజాయితీగల సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ న్యాయమూర్తుల బృందంతో కాశ్మీరీ పండిట్లను ఇక్కడ్నుంచి బహిష్కరించిన ఘటనలపై దర్యాప్తు జరిపించాలన్నారు. కాశ్మీరీ ముస్లింలే పండిట్లను వెళ్లగొట్టారనే ఆరోపణలున్నాయని, దర్యాప్తుతో దీనిపై ప్రపంచానికి వాస్తవం తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలవురు కాశ్మీరీ పండిట్లు ఉన్నారని తెలిపారు. 1947 నుంచి కూడా కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు ఇక్కడే ఉంటున్నారని తెలిపారు. హిందువులైన కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చి వారి ప్రాంతాల్లో ఉంటేనే కాశ్మీర్ అనేది సంపూర్ణంగా ఉంటుందని అన్నారు.
మతాలకతీతంగా తాను సమానత్వానికి పెద్దపీట వేస్తామని అబ్దుల్లా అన్నారు. తన తండ్రి రెండు దేశాల సిద్ధాంతాన్ని నమ్మేవారుకాదని చెప్పారు. ముస్లింలు, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు అంతా వేరు అని భావించేవారు కాదని అన్నారు. ఆడమ్ అండ్ ఈవ్ ల సంతానంగానే భావించామన్నారు. అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. సమైక్యత కోసమే తాను పోరాడతానని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
కాగా, గత డిసెంబర్లో పానున్ కాశ్మీర్ ప్రివెన్షన్ ఆఫ్ జెనోసైడ్ అండ్ అట్రాసిటీస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. రీఫౌల్ చేయని సూత్రాల ఆధారంగా శాశ్వత పునరావాసం, బాధితులకు పరిహారం సహా పలు డిమాండ్లను ముందుంచింది.