జేకేసీఏ స్కాం: మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై సీబీఐ ఛార్జీషీటు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాపై సోమవారం సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాశ్మీర్లో క్రికెట్ స్టేడియంలు, అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) నుంచి 38 కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగపరిచారని సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది.
ఫరూక్తో పాటు జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోషియేషన్ (జేకేసీఎ) మాజీ చైర్మన్ మహ్మద్ అస్లాం గోని, జేకేసీఏ సెక్రటరీ సలీమ్ ఖాన్, కాశ్మీర్ బ్యాంక్ చైర్మన్ బషీర్ అహ్మద్ల పేర్లు కూడా సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. 2015 నుంచి హైకోర్టు ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, ఫరూక్ అబ్దుల్లాను విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు పంపినట్లు సీబీఐ అధికారి ఎస్ఎస్ కిషోర్ తెలిపారు.
కాగా, జేకేసీఏ మాజీ చైర్మన్ అస్లాం గోనినే నిధుల అవకతవకలపై ఫిర్యాదు చేయడం గమనార్హం. కాశ్మీర్లో క్రికెట్ స్టేడియంల నిర్మాణం కోసం తీసుకున్న నిధులను బ్యాలెన్స్ షీట్లో పొందుపరచలేదని, 50 కోట్లతో స్డేడియం, 27 వేలతో మౌలికవసతులు కల్పించామని తెలిపారు.
అయితే, ఫరూక్కు అతి సన్నిహితుడైన గోని అతనితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చెరారు. నిధుల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరిపించడం జేకేసీఐ చైర్మన్గా తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కుటుంబంతో బ్రిటన్లో గడుపుతున్న ఫరూక్ దేశం తిరిగి రాగానే విచారణకు హాజకుకావల్సిందని సీబీఐ ఆదేశించింది. దీంతో ఈ మాజీ సీఎం సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు.