కాశ్మీర్ లో రాజుకున్న రాజకీయ రచ్చ: మాజీ సీఎం కుమార్తె, చెల్లెలు నిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ రచ్చ రాజుకుంది. ఏ రాజకీయ గొడవలు చెలరేగుతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు చెందిన రాజకీయ నాయకులను ఇన్నాళ్లూ గృహ నిర్బంధంలో ఉంచిందో.. అదే గొడవ తలెత్తింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం పలువురు మహిళలు ఆందోళన చేపట్టారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కుమార్తె సఫియా అబ్దుల్లా నేతృత్వం వహించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ ఉదయం వందలాది మంది మహిళలు ప్రదర్శన చేపట్టారు. శ్రీనగర్ ప్రతాప్ పార్క్ నుంచి లాల్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. నల్లరంగు రిబ్బన్లను ధరించి, ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేంద్ర మోడీ ముర్దాబాద్ అంటూ నినదించారు. ర్యాలీగా తరలి వెళ్లిన తరువాత లాల్ చౌక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేది వారి ఉద్దేశం. వారి చర్యలను శ్రీనగర్ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీసు బలగాల జవాన్లు భగ్నం చేశారు. ప్రతాప్ పార్క్ వద్ద ర్యాలీగా బయలుదేరిన మహిళలను అడ్డుకున్నారు.
లాల్ చౌక్ వరకూ వారిని రానివ్వలేదు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రదర్శనకారుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. తమ అరెస్టును ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీనితో స్వల్పంగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకుని, వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ప్రదర్శనకు నాయకత్వాన్ని వహించిన సఫియా అబ్డుల్లాతో పాటు సురయ్యాను అరెస్టు చేశారు.
అరెస్టు సందర్భంగా సురయ్యా, సఫియా ఫరూఖ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. శాంతియుత జీవనాన్ని గడుపుతోన్న కాశ్మీరీ ప్రజలను అభద్రత వాతావరణంలోకి నెట్టేసిందని ఆరోపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోందని, పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం ఉందని అన్నారు. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.