ఫరూక్ అబ్దుల్లాకు షాక్: మరో మూడు నెలలు గృహ నిర్బంధంలోనే..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడగిస్తూ శ్రీనగర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు నెలలూ ఆయన తన గృహంలోనే నిర్బంధంలో కొనసాగుతారని, దీనినే సబ్ జైలుగా భావిస్తామని అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం 370ని రద్దు చేసిన తర్వాత ముందస్తు చర్యల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలోనే ఉంచారు. అంతేగాక, ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కూడా మొట్టమొదటగా ఆయనపైనే మోపడం గమనార్హం.
కాగా, ఫరూక్ అబ్దుల్లా ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నిక అయ్యారు. 81ఏళ్ల ఈ నేషనల్ కాన్ఫరెన్స్ నేత బయటికి వస్తే వ్యాలీ ప్రాంతంలో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే కారణంతో ఆయనను ప్రభుత్వం గృహ నిర్బంధం చేస్తోంది.
భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారనే అభియోగాలు కూడా ఫరూక్ అబ్ధుల్లాపై ఉన్నాయి. పుల్వామాలో ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలో ఫరూక్ మాట్లాడుతూ.. ఇది ఉగ్రవాదులు చేసిన దాడి కాదు.. భారత ప్రభుత్వమే చేయించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేగాక, భారత్ నుంచి స్వేచ్ఛ పొందేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారని ప్రభుత్వం పేర్కొంది. ఫరూక్ తోపాటు సివిల్ సర్వెంట్ నుంచి రాజకీయ నేతగా మారిన షా ఫీజల్ను కూడా పీఎస్ఏ కింద అదుపులోకి తీసుకున్నారు.