హమ్మయ్యా... క్రిమినల్ను మట్టుబెట్టిన పోలీసులు, 23 మంది చిన్నారులు సేఫ్
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో హడలెత్తించిన క్రిమినల్ సుభాష్ బథామ్ను పోలీసులు మట్టుబెట్టారు. నిన్న సాయంత్రం తమ ఇంట్లో బర్త్ డే పార్టీ ఉంది అని చుట్టుపక్కల చిన్నారులను తీసుకెళ్లి నిర్బంధించిన సంగతి తెలిసిందే. కాపాడే ప్రయత్నం చేసిన స్థానికులపై తేలికపాటి బాంబు కూడా వేశాడు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనాస్థలంలోకి చేరుకొన్న పోలీసులు సమయం చూసి నిందితుడిని ఎన్కౌంటర్ చేశారు.
చిన్నారులు సేఫ్
ఇంట్లో ఉన్న చిన్నారులను కాపాడే సమయంలో పోలీసులకు, సుభాష్కు మధ్య కాల్పులు జరిగాయని యూపీ అడిషనల్ సెక్రటరీ అవనీష్ కుమార్ అవస్తీ పేర్కొన్నారు. కాల్పుల్లో క్రిమినల్ చనిపోయారని ఆయన ధ్రువీకరించారు. నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఫరూఖాబాద్లో హైటెన్షన్ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిన చిన్నారులు రాకపోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాంబు విసిరిన క్రిమినల్
సాయంత్రం 5 గంటలకు ఇంటిలోపలికి వెళ్లేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ తేలికపాటి బాంబు విసరడంతో స్థానికులు గాయపడ్డారు. దాదాపు 9 గంటలకు పైగా చిన్నారులు క్రిమినల్ చెరలో ఉన్నారు. పోలీసుల సమాచారంతో స్పెషల్ టీం కూడా రంగంలోకి దిగింది. చిన్నారులను క్రిమినల్ చెర నుంచి ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి 1 గంటలకు ఇంటిలోకి ప్రవేశించారు. తలుపుల పగులగొట్టి ఎంటరైన పోలీసులు.. కాల్పులు జరపడంతో సుభాష్ చనిపోయాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సుభాష్ మృతిచెందాడు.
రంగంలోకి ఎన్ఎస్జీ
పరిస్థితి తీవ్రత దృష్టా ఎన్ఎస్జీ కమాండోలను కూడా రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వారు వచ్చేలోపు పోలీసులు సుభాష్ను ఎన్కౌంటర్ చేశారు. మరోవైపు పరిస్థితిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. క్షణ క్షణం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడి నుంచి పిల్లలను క్షేమంగా రక్షించిన పోలీసు బృందాన్ని అభినందించారు.