వాహనదారులకు అలర్ట్: రేపట్నుంచి ‘ఫాస్టాగ్’, లేదంటే రెట్టింపు టోల్ ఫీ చెల్లించాల్సిందే
నాగ్పూర్: వాహనాల వినియోగదారులు తక్షణమే ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రమూ ఫాస్టాగ్ గడువును పొడిగించేది లేదని తేల్చిచెప్పారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ను తీసుకోవాలని సూచించారు.
టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ తప్పనిసరి గడువు ఫిబ్రవరి 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయనఈ మేరకు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడించామని తెలిపారు.
మరోవైపు ఫాస్టాగ్ ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి(16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఫాస్టాగ్ అమర్చకపోతే సదరు వాహనానికి నిర్దేశించిన దానికంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా, టోల్ ప్లాజాల వద్ద ఈ పేమెంట్ విధానం ఫాస్టాగ్ పద్ధతిలో టోల్ ఫీజు చెల్లింపును 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతి ఫాస్టాగ్లో టోల్ ఫీజు చెల్లించడం వల్ల వాహనాలు స్మూత్గా ముందుకు వెళ్లిపోతాయని, ట్రాఫిక్ జామ్ ఉండబోదని నితిన్ గడ్కరీ తెలిపారు.
Recommended Video
ఇప్పటికే కొన్ని రూట్లలో వాహనాల ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90 శాతం పూర్తయిందని, పది శాతం మాత్రమే మిగిలి ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు ఉన్న ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ గడువును ఫిబ్రవరి 15 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.