FASTag: ట్యాగ్ లేకుండా ఆ లైన్లో వెళితే డబుల్ టోల్ ఫీజు, 15 వరకే నగదు చెల్లింపులు
Recommended Video
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ విధానానికి ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్దంకాని వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. పలు టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు బారులు తీరారు.
25శాతం హైబ్రిడ్ లైన్..
ఫాస్టాగ్కు ఇంకా సిద్ధం కానివారి కోసం కేంద్రం ఓ వెసులుబాటు కల్పించింది. టోల్ గేట్ల వద్ద 25శాతం హైబ్రిడ్ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మొదట జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం టోల్ టేట్ల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఒకే లైన్ కేటాయించారు.
ట్యాగ్ లేకుండా ఆ లైన్లో వెళితే డబుల్ టోల్ ఫీజు.
ట్యాగ్ లేకుండా ఫాస్టాగ్ లైన్లో వెళ్లేవారికి అపరాధ రుసుముగా రెట్టింపు టోల్ వసూలుచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, శనివారం ఆ ఉత్తర్వుల్లో సవరణ చేసిన కేంద్రం.. 25శాతం హైబ్రిడ్ లైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ లైన్లలో ఫాస్టాగ్ తోపాటు ఇతర పద్ధతుల్లోనూ చెల్లింపులు జరిపే వెలుసుబాటు కల్పించారు.
జనవరి 15 వరకే నగదు చెల్లింపులు..
అయితే ఈ సౌకర్యం వచ్చే జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ చేయించుకుంటే ఈ రెట్టింపు టోల్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో పలు టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఈ రోజులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఫాస్టాగ్ ఇబ్బందులు.. బారులు తీరిన వాహనాలు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజాలోని 5 గేట్ల ద్వారా ఫాస్టాగ్, 3 గేట్ల ద్వారా నగదు చెల్లింపు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. నగదు చెల్లింపులు జరిపే మూడు గేట్లలో భారీగా వాహనాలు బారులు తీరాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర టోల్ గేట్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.