భారత్లో అత్యధిక వేతనాలు: ఐఐటీనా మాజాకానా?
కోట: భారత్లో అత్యధిక వేతనం తీసుకుంటున్నది ఎవరు? అంటూ ఠక్కున చెప్పే సమాధానం కార్పోరేట్ సంస్ధల సీఈఓలు. వీళ్లు కాకపోతే, టీమిండియా జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ అని పేరు వినిపిస్తుంది. కానీ వాస్తవానికి వీరితో పోలిస్తే మన దేశంలో అత్యధిక వేతనాలు తీసుకునే వారు వేరే ఉన్నారంట.
వారెవరో తెలుసా? ఐఐటీలో సీటు సాధించాలని కలలుగనే విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చే వారు. నైపుణ్యం ఉండి పాఠ్యాంశాలను క్లుప్తంగా విద్యార్దులకు వివరించగలిగే ఐఐటీ కోచింగ్ స్టాఫ్కు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారంట.
అది కూడా కేవలం మూడు నుంచి నాలుగు నెలల కాలానికి మాత్రమే. రాజస్ధాన్లోని కోట ప్రాంతంలో ఐఐటీ సీటు కోరే విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్న వారిలో 15 నుంచి 20 మందికి కోటి రూపాయలకు పైగా వేతనాలు అందుతున్నాయని బన్సల్ క్లాసెస్ మేనేజర్ హరి కిషన్ వెల్లడించారు.
ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, కాన్పూర్, పాట్నాలలో పరిశీలిస్తే వీరి సంఖ్య వందల్లో ఉంటుందని తెలిపారు. సాధారణంగా ఐఐటీ విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చే శిక్షకులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
కాబట్టి ఎవరు ఎక్కువ వేతనం ఆఫర్ చేస్తే వారు అక్కడికి వెళ్లిపోతారని హరి కిషన్ తెలిపారు. మనదేశంలో ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు రెండు వేల మందికి పైగా ఉంటే అందులో 600 మంది వరకూ ఐఐటీ డిగ్రీలను పూర్తి చేసిన వారే ఉండటం గమనార్హం.
వీరిలో 400 మందికి రూ. 60 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకూ వేతనాలు అందుతున్నాయని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ అశిష్ అరోరా వివరించారు. మరో 50 మంది అంతకు మించే వేతాలను అందుకుంటున్నారు.
గడచిన పదేళ్లలో ఐఐటీ విద్యార్ధులకు శిక్షణ ఇస్తోన్న శిక్షకుల వేతనాలు 7 శాతం పెరిగినట్లు కెరీర్ పాయింట్ వ్యవస్ధాపక సీఈఓ ప్రమోద్ మహేశ్వరి తెలిపారు. ఆయా ఇనిస్టిట్యూట్లు సంవత్సరానికి మూడు సార్లు టీచర్ల నియామకాలు చేపడతాయని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఐఐటీ కోచింగ్కు రాజస్ధాన్లోని కోట పెట్టింది పేరని అన్నారు. మంచి టీచర్ల కొరత ఉందని చెప్పిన ఆమె, కెరీర్ పాయింట్ గతేడాది రూ. 5.82 కోట్లు నికర ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఈ ఏడాది ఐఐటీ జయింట్ ఎంట్రెన్స్ పరీక్షలకు 1.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
వీరంతా కోచింగ్ నిమిత్తం ఇనిస్టిట్యూట్లకు వెళితే, ఫీజు రూపంలో కనీసం రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అదే పేరున్న ఇనిస్టిట్యూట్ అయితే దాదాపు రూ. మూడు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.