టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!
బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. వారంతా యువకులే కావడం విషాదకరం.
మృతులను నందు పవార్, అమూల్ నావి, సురేష్ కానేరి, అమూల్ చౌరి, మహేష్ చౌరిగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దేవగిరికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కారులో మహారాష్ట్రలోని కొల్హాపూర్కు వెళ్లి, స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బెళగావి నగర శివార్లలో శ్రీనగర బైపాస్ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో కారు టైరు ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. దీనితో కారు అదుపు తప్పింది. కారును నియంత్రించడంలో డ్రైవర్ విఫలం అయ్యారు. దీనితో డివైడర్ను ఢీ కొట్టిన కారు సుమారు పది అడుగుల మేర గాల్లోకి ఎగిరింది. అవతలి రోడ్డు మీద ఎదరుగా వస్తోన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అయిదుమంది యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న వెంటనే మాళమారుతి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బెళగావి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.