లవర్ పిలిచిందని వెళ్తే: తండ్రీ, కుమారుడిని చెట్టుకు కట్టి చితగ్గొట్టారు!
ప్రయాగ్రాజ్: ఉత్తర్ప్రదేశ్లో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొందరు స్థానికులు తండ్రి, కుమారుడిని చెట్టుకు కట్టి చితకబాదిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వారిని తీవ్రంగా కొట్టడమే కాకుండా- స్పృహ తప్పేంత వరకూ గుంజీలు తీయించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించారు. దీనిపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
పవన్ అనే యువకుడు ప్రయాగ్రాజ్ జిల్లాలో మేజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔతా గ్రామంలో నివసిస్తున్నాడు. కొంతకాలంగా అతను అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సాయంత్రం ఆమె పిలిచిందనే కారణంతో తన స్నేహితుడు వినయ్తో కలిసి గ్రామ శివార్లలోని ఓ మామిడితోపునకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న కొందరు యువకులు పవన్ను బంధించారు. వారి చెర నుంచి తప్పించుకున్న వినయ్.. ఈ విషయాన్ని పవన్ తండ్రికి తెలియజేశాడు. తన కుమారుడిని కాపాడుకోవడానికి రాగా, అతణ్ని కూడా బంధించారు.
వారిద్దరిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం- గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. మేజా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని, నివేదికను అందజేయాలని జిల్లా ఎస్పీ దీపేంద్రనాథ్ చౌదరి మేజా పోలీసులను ఆదేశించారు.