కోర్టు కేసు: తండ్రికూతుళ్లపై యాసిడ్ దాడి
ముజఫర్ నగర్: కోర్టు విచారణకు హాజరై ఇంటికి వెళుతున్న తండ్రీకూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. మంగళవారం సాయంత్రం తీవ్రగాయాలైన తండ్రి, కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
కవాల్ గ్రామంలో రహీన్ అహమ్మద్ (55) అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె గుల్షాన్ (30). సత్ బీర్ అనే వ్యక్తితో గుల్షాన్ వివాహం జరిగింది. తరువాత భర్తతో పాటు అత్తమామలు వరకట్నం తీసుకురావాలని గుల్షాన్ ను వేధించారని తెలిసింది.
వేధింపులు తట్టుకోలేని గుల్షాన్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. అయితే నిత్యం సత్ బీర్, అతని కుటుంబ సభ్యులు కేసు వాపస్ తీసుకోవాలని తండ్రీకూతుళ్ల మీద ఒత్తిడి చేశారు.అందుకు వీరు అంగీకరించలేదు.
మంగళవారం సాయంత్రం కోర్టు విచారణకు హాజరై ఇంటికి వెళుతున్న రహీన్ అహమ్మద్, ఆయన కుమార్తె మీద సిక్రీదా గ్రామం సమీపంలో యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఇద్దరు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని సత్ బీర్, అతని కుటుంబ సభ్యులు పరారైనారని పోలీసు తెలిపారు.