కోటి రూపాయల కోసం కన్న కుమార్తెను చంపేసిన తండ్రి: ఆస్తి అమ్మి వాటా ఇవ్వాలని !
బెంగళూరు: కోటి రూపాయల కోసం సొంత కుమార్తెను తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు దక్షిణ తాలుకా కగ్గలీపుర సమీపంలోని కుల్లయ్యనపాళ్యలో జరిగింది. కుమార్తెను హత్య చేసిన కిరాతక తండ్రితో పాటు నలుగురిని కగ్గలీపుర పోలీసులు అరెస్టు చేశారు.
చిక్కబ్యాటప్ప అలియాస్ సంపంగికి పొలం ఉంది. సంపంగికి ఓ కుమార్తె ఉంది. ఇటీవల సంపంగి రూ. 2 కోట్లకు పొలం విక్రయించాడు. సంపంగి ఒక కోటి రూపాయలు జల్సాల కోసం ఖర్చు చేసుకున్నాడు. మిగిలిన కోటి రూపాయలు కుమార్తెకు ఇవ్వవలసి ఉంది.
అయితే కోటి రూపాయలు తన దగ్గరే పెట్టుకోవాలని నిర్ణయించిన సంపంగి లక్ష్మి, ఇస్మాయిల్ ఖాన్, యునిరాజుతో కలిసి ఈనెల 11వ తేదీన కుమార్తెకు బలవంతంగా విషం తాగించి ఉరి వేసి చంపేశారు. అనంతరం తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సంపంగి కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించడానికి ప్రయత్నించాడు.
సంపంగి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు అసలు విషయం చెప్పారు. రూ. రెండు కోట్లకు పొలం అమ్మిన సంపంగి వాటా ఇవ్వాల్సి వస్తోందని కుమార్తెను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టుం రిపోర్టులో యువతికి బలవంతంగా విషం తాగించి హత్య చేశారని వెలుగు చూడటంతో సంపంగి, ఇస్మాయిల్ ఖాన్, లక్ష్మి, మునిరాజును మంగళవారం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.