రూ. 2వేల కోసం కన్న కొడుకునే హతమార్చాడు
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 2వేల నగదు కోసం.. కన్న కొడుకని కూడా చూడకుండా దారుణంగా హత్య చేశాడు ఓ కర్కశపు తండ్రి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్ ప్రాంతంలో సామ్సల్ షాఫిక్ మియా తన కొడుకు ఫిరోజ్ ఆలమ్, ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఫిరోజ్ అక్కడో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి స్వస్థలం బీహార్ రాష్ట్రం కాగా.. అక్కడినుంచి జీవనోపాధి కోసం మహారాష్ట్రకు వలస వచ్చారు.
ఇటీవల షాఫిక్ మియా తమ స్వస్థలానికి వెళ్లొస్తానంటూ.. ఖర్చుల కోసం రూ. 2వేలు ఇవ్వమని కొడుకు ఫిరోజ్ని అడిగాడు. అంత మొత్తం ప్రస్తుతం తన వద్ద లేదని, కొద్ది రోజుల తర్వాత చూద్దామని ఫిరోజ్ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు.
దీంతో తనకు డబ్బు ఇవ్వనంటావా? అంటూ షాఫిక్ మియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోని సుత్తితో కొడుకు తలపై బాదేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫిరోజ్ని వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ ఫిరోజ్ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాసిక్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు షాఫిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.