రాష్ట్రపతి కూతురుకు వేధింపుల కేసులో కొత్త మలుపు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ముఖర్జీ వేధింపుల అంశం కొత్త మలుపు తిరిగింది. ఆమెకు ఆన్లైన్లో వేధింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో వేధింపులకు గురి చేసిన వ్యక్తి తండ్రి షర్మిష్ఠకు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా క్షమాపణలు చెప్పారు.
దీనిపై షర్మిష్ఠ మాట్లాడుతూ.. మానసిక వ్యాధిగ్రస్తుడైన తన కొడుకును క్షమింాలని ఆయన కోరారని మంగళవారం వెల్లడించారు. అన్నింటికంటే ముందుగా నిందితుడిని (పార్థ మండల్)ను పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించానని చెప్పారు. నిందితుడు పార్థా మండల్ తండ్రి తనకు ఓ సందేశం పంపించారని చెప్పారు.
నా కుమారుడి మానసిక స్థితి బాగా లేనందున అతనికి చికిత్స చేయిస్తున్నామని, తన కొడుకు తరఫున నేను క్షమాపణలు చెబుతున్నానని, దయచేసి మన్నించాలని అతను సందేశం పంపించాడని చెప్పారు.
అందుకు తాను, మీ కుమారుడిని పోలీసులకు అప్పగించి, వైద్య పరీక్షలు చేయించాలని సూచించానని, అప్పుడు నిజానిజాలు అవే తెలుస్తాయని చెప్పానని తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన పార్థ మండల్ గత శుక్ర, శనివారాల్లో షర్మిష్టకు అసబ్య సందేశాలు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.