ఐఐటీకి పంపించి తప్పు చేశా..: ఢిల్లీ పీహెచ్డీ విద్యార్థి మృతిపై తండ్రి ఆవేదన!
సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ క్యాంపస్లో మంజుల అనే పీహెచ్డీ విద్యార్థి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమార్తె ఆత్మహత్య పట్ల తాజాగా ఆమె తండ్రి స్పందించారు. అసలు తన కుమార్తెను ఉన్నత చదువులకు పంపించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే తమ కూతురికి పెళ్లి చేసి తప్పు చేశామన్నారు. జాతకాలు కలిశాయని పెళ్లి చేస్తే.. ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. అల్లుడు రితేశ్ కు తమ కూతురు చదువుకోవడం ఇష్టం లేదని, చదువు మానేయాలని తరుచూ ఒత్తిడి తెచ్చేవాడని పేర్కొన్నారు.
సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కేవలం కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే తమ కూతురు విడాకుల జోలికి వెళ్లలేదన్నారు. కట్నం ఇచ్చేందుకు తాను డబ్బు కూడబెట్టి ఉండాల్సిందన్నారు.
కాగా, గతంలో అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసిన మంజుల 2011లో ఢిల్లీ ఐఐటీలో చేరింది. జలవనరులపై ఆమె పరిశోధన సాగిస్తోంది. ఇటీవల క్యాంపస్ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంజుల ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని, ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు.