ఈవ్ టీజింగ్ వద్దన్నందుకు తండ్రీకొడుకులను కాల్చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలను ఈవ్ టీజింగ్ చేయొద్దన్నందుకు ఓ తండ్రీకొడుకులను నలుగురు దుండగులు తుపాకులతో కాల్చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వారా గ్రామానికి చెందిన నవాబ్(50), అతని కుమారుడు(22) పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు దుండగులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.
ఆ దుండగులను తండ్రీకొడుకులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు నవాబ్, సందీప్లను తుపాకులతో కాల్చారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు.
బాధిత తండ్రీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.