ఐసిస్ చెరనుండి కేరళకు చెందిన ఫాదర్ టామ్ విడుదల
ఇండియాకు చెందిన ఫాదర్ టామ్ ఐసిస్ చెర నుండి విడుదలయ్యారు.ఏడాది క్రితం ఫాదర్ టామ్ను ఐసిస్ తీవ్రవాదులు బందీలుగా తీసుకొన్నారు.భారత్, ఒమన్ ప్రభుత్వాలు టామ్ను విడిపించేందుకు కృషి చేశాయి
న్యూఢిల్లీ: గతేడాది యెమెన్లో తీవ్రవాదుల చేతికి చిక్కిన కేరళకు చెందిన క్రైస్తవ మతాధిపతి టామ్ ఉళున్నాలిల్ను భారత, ఒమన్ ప్రభుత్వాలు విజయవంతంగా రక్షించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో వెల్లడించారు.
2016, మార్చి 4న యెమెన్లోని ఏడెన్ ప్రాంతంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీలపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 16 మంది చనిపోయారు. మతాధిపతిని తీవ్రవాదులు చెరలో బంధించారు. ఈ ఏడాది మేలో తనను కాపాడాలని కోరుతూ టామ్ ఓ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు.
కిడ్నాపర్లు తమ డిమాండ్లను చెప్పేందుకు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టామ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. .. ఆయన కిడ్నాప్ అయినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇండియాతో పాటు ఓమన్ ప్రభుత్వం కూడ టామ్ను విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.
ప్రస్తుతం టామ్ ఒమన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని విడుదలకు సంబంధించిన ఫొటోను ఒమన్ మీడియా ప్రసారం చేసింది. రెండ్రోజుల్లో ఒమన్ నుంచి న్యూఢిల్లీకి టామ్ను తీసుకురానున్నట్లు సమాచారం.
అంతేగాక . తాజాగా ఆయనను సురక్షితంగా విడిపించినట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు.టామ్ రక్షించినందుకు అతని కుటుంబ సభ్యులు, క్రైస్తవ మతాధిపతులు భారత, ఒమన్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.