ముస్లింలకు కొత్త ఫత్వా: అల్లాని తప్ప వేరే దేవుళ్లను ఆరాధిస్తే...
సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల సంచలన ఫత్వా వెలువరించిన ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్... తాజాగా భారతీయ ముస్లింలకు మరో కొత్త ఫత్వా జారీ చేసింది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల సంచలన ఫత్వా వెలువరించిన ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్... తాజాగా భారతీయ ముస్లింలకు మరో కొత్త ఫత్వా జారీ చేసింది.
ముస్లిం పురుషులు, మహిళలు అల్లాని తప్ప మరే ఇతర దేవుళ్లను ఆరాధించరాదని స్పష్టం చేసింది. ''అల్లాని తప్ప ఎవరైనా ఇతర దేవుళ్లను ఆరాధిస్తే.. వాళ్లు ముస్లింలుగా ఉండబోరు..'' అని దారుల్ ఉలూమ్ దియోబంద్ పేర్కొంది.
దీపావళి సందర్భంగా వారణాసిలో కొందరు ముస్లిం మహిళలు హారతి ఇచ్చిన నేపథ్యంలోనే... శనివారం సదరు ముస్లిం సంస్థ ఈ ఫత్వా జారీ చేయడం గమనార్హం.
ముస్లిం మహిళలు కనుబొమ్మలను పీకడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, మంచి షేప్ వచ్చేలా తీర్చిదిద్దుకోవడం వంటి చర్యలపైనా ఈనెల మొదట్లో దారుల్ ఉలూమ్ ఫత్వా జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.
ముస్లిం మహిళలు కనుబొమ్మలు పీకడం, జుట్టు కత్తిరించుకోవడం సహా మొత్తం పది అంశాలు ఇస్లాంకి విరుద్ధమంటూ దారుల్ ఇఫ్తా వివరణ ఇచ్చారు. తాజాగా అల్లాను తప్ప మరో దేవుణ్ణి ఆరాధించరాదంటూ మరో ఫత్వాను జారీ చేశారు.