ఇది రొంబ టూ మచ్ పా : ఆమె సెప్పిందేటి.. తమరు సెలవిస్తున్నదేటి: రాహుల్కే టోకరా..!
పాండిచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు, మత్స్యకారులను కలిశారు. వారితో మాట్లాడారు. అయితే, ఓ మహిళ పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ రాహుల్ గాంధీకి తమ మాతృ భాషలో తెలిపింది. అయితే, ఆమె చెప్పినదాన్ని ఫిర్యాదుగా కాకుండా ప్రశంసగా మార్చి చెప్పారు పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సీఎం నారాయణసామిపై రాహుల్కి ఫిర్యాదు
బుధవారం పుదుచ్చేరిలోని మత్స్యకారులతో రాహుల్ గాంధీ, నారాయణస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు మత్స్యకారులు. సోలాయినగర్కు ఓ మత్స్యకార మహిళ రాహుల్ గాంధీకి పుదుచ్చేరి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తుఫాను వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కనీసం తమను పరామర్శించలేదని, తమ సమస్యలను పట్టించుకోలేదని తమ మాతృభాషలో రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.
ఆమె ప్రశంసించిందంటూ రాహుల్కి సీఎం నారాణసామి అనువాదం
అయితే, ఆమె చేసిన ఫిర్యాదును తనపై ప్రశంసలుగా మార్చుకున్నారు సీఎం నారాయణస్వామి. నివర్ తుఫాను సందర్భంగా తాను ఈ ప్రాంతాలను సందర్శించినట్లు, సహాయం అందించినట్లు చెబుతోందని రాహుల్ గాంధీకి అనువాదం చేశారు సీఎం నారాయణసామి. దీనిపై ఆయనను ప్రశ్నించగా.. తాను తప్పుగా ఏమి అనువాదం చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
అబద్ధాల పర్యాటన అంటూ బీజేపీ ఫైర్..
రాహుల్ గాంధీ పుదుచ్చేరి అబద్ధాల పర్యటనలో మరో అబద్ధం అంటూ బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. ఓ ముసలావిడ తనకు ఎలాంటి సాయం అందలేదని ఫిర్యాదు చేస్తే.. అన్ని రకాలుగా సాయం చేశానని చెప్పిందని సీఎం చెప్పుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇది ఇలావుండగా, అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. మరోవైపు తమిళనాడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఇంఛార్జీ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అప్పగించిన విషయం తెలిసిందే.