రాజకీయ ప్రకటనలకు ఫేస్బుక్ కొత్త రూల్స్, బాధ్యత వారిదే
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ గురువారం కీలక ప్రకటన చేసింది. దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కొత్త రూల్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింది. తమ ప్లాట్ ఫాంపైకనిపించే ప్రకటనల విషయంలో పలు మార్పులు చేసినట్లు పేర్కొంది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల్లో పబ్లిష్డ్బై, పెయిడ్ ఫర్ బై వంటి డిస్క్లెయిమర్లను ఇకపై అందరు చూడవచ్చునని తెలిపింది.
త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనల్లో పారదర్శకత తీసుకు వచ్చేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఈ చర్యలు చేపట్టింది. ప్రకటనదారుడి వివరాలనూ నెటిజన్లు తెలుసుకునేలా మార్పులు చేసింది. ఇక నుంచి రాజకీయ ప్రకటనలకు ప్రకటనకర్తలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు 'డిస్ల్కెయిమర్' లేబుల్ను ప్రవేశపెట్టింది.
పొలిటికల్ యాడ్ ఎవరిచ్చారు, ఎన్నికల ప్రకటనకు ఎంత ఖర్చు చేశారో యూజర్లకు వెంటనే తెలిసిపోతుంది. గురువారం నుంచి ఫేస్బుక్ ప్లాట్ ఫాంపై ఇచ్చే పొలిటికల్ యాడ్స్ ఎవరూ పబ్లిష్ చేశారని, 'డిస్ల్కెయిమర్' పొలిటికల్ యాడ్కు ఎంతవరకు ఖర్చు చేశారో యూజర్లు తెలుసుకోవచ్చు' అని తెలిపింది. ఇందులో 'డిస్ల్కెయిమర్' పేరు, అథరైజ్డ్ అడ్వటైజర్స్ పేరుతో పాటు రన్ చేసే ఫేస్బుక్ పేజీ లేదా ఆర్గనైజేషన్ పేరు యాడ్ వెనుక డిసిప్లే అవుతుంది.
దీంతో నకిలీ అకౌంట్లతో పేజీలు నిర్వహించకుండా చెక్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే రాజకీయ ప్రకటనలను భద్రపరిచేందుకు లైబ్రరీ ఏర్పాటు చేస్తోంది. ఏడేళ్ల పాటు అందుబాటులో యాడ్స్ డేటా ఉంటుంది. ఎలాంటి లాగిన్ లేకుండానే వాటిని చూడవచ్చు.