నీర్జా హంతక ఉగ్రవాదులు వీరే: ఏజ్తో ఫొటోలు రిలీజ్ చేసిన ఎఫ్బీఐ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత విమానయాన సిబ్బంది నీర్జా బానోత్ ప్రాణాలు తీసిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను అమెరికా నిఘా సంస్థ ఎఫ్బీఐ గురువారం విడుదల చేసింది. ఏజ్ ప్రొగ్రేషన్ టెక్నాలజీ సాయంతో ఉగ్రవాదులు ఇప్పుడు ఎలా ఉంటారో ఆ ఫొటోల ద్వారా తెలిపింది.
1986లో జరిగిన హైజాక్ ఘటనలో నీర్జా బానోత్.. ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఉగ్రవాదులతో పోరాడిన నీర్జాకు భారత ప్రభుత్వం ఆమె మరణానంతరం అశోక చక్ర అవార్డును ప్రకటించింది. ఇటీవలే నీర్జా జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'నీర్జా' సినిమాను తెరకెక్కించారు.
కరాచీలో హైజాక్
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1986 సెప్టెంబరు 5న ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్న పాన్ ఆమ్ విమానం పాకిస్థాన్లోని కరాచీలో హైజాక్కు గురైంది. కాగా, 379 మంది ప్రయాణికులు, సిబ్బంది ముంబై నుంచి కరాచీ మీదుగా ఫ్రాంక్ఫర్ట్ వెళ్లాల్సి ఉంది.
మెషిన్ గన్లతో కాల్పులు
కాగా, కరాచీలో విమానం కొద్ది సేపు ఆగి మళ్లీ బయల్దేరే సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఎయిర్పోర్టు సిబ్బంది దుస్తులు ధరించి విమానంలోకి వచ్చారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న మెషిన్ గన్లు తీసి కాల్పులు జరిపి విమానాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ హైజాక్ ఘటనలో విమాన సిబ్బంది సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నీర్జా ఒకరు.
ప్రాణాలను ఫణంగా పెట్టిన నీర్జా
ప్రయాణికులను రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చి తన ప్రాణాలను అడ్డుపెట్టిన నీర్జా ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ హైజాక్కు కారణమైన ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి ఫొటోలను ఎఫ్బీఐ 2000 సంవత్సరంలో సేకరించింది.
ఈ వయస్సులో ఉగ్రవాదులెలా ఉంటారో..
తాజాగా, ఆ ఉగ్రవాదుల ఫొటోలను ఏజ్ ప్రొగ్రేషన్ సాయంతో మార్పులు చేసి విడుదల చేసింది. వారి పేర్లు వదౌద్ మహ్మద్ హఫీజ్ అల్ తుర్కీ, జమల్ సయీద్ అబ్దుల్ రహీమ్, మహ్మద్ అబ్దుల్లా ఖలీల్ హుస్సేన్ అర్రహయ్యల్, మహ్మద్ అహ్మద్ అల్ మునావర్ అని పేర్కొంది.
ఉగ్రవాదులపై భారీ నజరానా
ఈ ఉగ్రవాదులంతా అబు నిదాల్ ఆర్గనైజేషన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించింది. వీరిని పట్టించిన వారికి లేదా వీరి గురించి వివరాలు తెలిపిన వారికి రివార్డు అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఉగ్రవాది తలపై 5 మిలియన్ డాలర్ల రివార్డు అందిస్తామని వెల్లడించింది.