భజరంగి భాయిజాన్: అక్రమంగా భారత్లో: గిఫ్ట్ బాక్సులతో స్వదేశానికి: పాక్ సిస్టర్స్ వీడియో ఇదీ
శ్రీనగర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ భజరంగి భాయిజాన్ను గుర్తుకు తీసుకొచ్చే ఉందంతం ఇది. దేశ సరిహద్దులకు అవతలి వైపు నుంచి పొరపాటున భారత్లోకి ప్రవేశించిన మాటలు రాని ఓ బాలికను హీరో స్వదేశానికి ఎలా చేర్చాడనే ఉదంతం చుట్టూ తిరుగుతుందీ సినిమా. అచ్చంగా అలాంటి సంఘటనే జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకుంది. కథ సుఖాంతమూ అయింది. పొరపాటున సరిహద్దులను దాటుకుని భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెలిని ఆర్మీ అధికారులు సురక్షితంగా స్వదేశానికి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు.
తిరుమలకు వెళ్తున్నారా? కాస్త జాగ్రత్త: భారీ వర్షాల ధాటికి ప్రమాదకరంగా ఘాట్ రోడ్డు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఇద్దరు అక్కాచెల్లెలు ఆదివారం మధ్యాహ్నం భారత్లోకి పొరపాటున ప్రవేశించారు. వారి పేర్లు లైబా జబేర్, సనా జబేర్. జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ జిల్లా వద్ద సరిహద్దుల్లో వారు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. వారిని సరిహద్దు భద్రతా జవాన్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. వారిని తమ వెంట తీసుకెళ్లారు. పూంఛ్ జిల్లాలోని సైనిక కార్యలయంలో విచారించారు. వారి నుంచి సమగ్ర వివరాలను రాబట్టారు. ఉగ్రవాదులతో గానీ, అనుబంధ సంస్థలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ధృవీకరించారు.
పీఓకేలోని అబ్బాస్పూర్ నివాసులుగా..
అక్కాచెల్లెలు వెల్లడించిన వివరాల గురించి ఆరా తీయగా.. నిజమేనని తేలింది. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లోని కహుటా తహశీల్ పరిధిలో గల అబ్బాస్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పొరపాటున వారు సరిహద్దులను దాటుకుని భారత్లోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. వారిని వెనక్కి పంపించేయాలని నిర్ణయించారు. ఈ ఉదయం వారిని తీసుకుని మళ్లీ సరిహద్దులకు చేరుకున్నారు. సరిహద్దుల్లోని చకన్ దా బాగ్ (సీబీడీ) వద్ద గల మిలటరీ అధికారుల మీటింగ్ పాయింట్ వద్ద లైబా జబేర్, సనా జబేర్లను పాకిస్తాన్ అధికారుల చేతికి అప్పగించారు. వారికి గిఫ్టులు ఇచ్చి మరీ సాగనంపారు.
కొడతారనుకున్నాం.. బాగా చూసుకున్నారు..
ఈ సందర్భంగా లైబా జబేర్ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ అధికారులు రికార్డు చేశారు. తాము పొరపాటున భారత్లోకి ప్రవేశించామని స్పష్టం చేశారు. తమకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని పేర్కొన్నారు. తమను ఆర్మీ సైనికులు కొడతారని భయపడ్డామని, అలా చేయలేదని లైబా తెలిపారు. తమను బాగా చూసుకున్నారని చెప్పారు. తమకు ఇక వెనక్కి పంపించరని ఆందోళన చెందామని అన్నారు. దీనికి భిన్నంగా ఏ మాత్రం ఆలస్యం కూడా చేయకుండా తమను ఇంటికి పంపిస్తున్నారని, వారికి కృతజ్ఙతలు తెలుపుకొంటున్నామని అన్నారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారని లైబా అన్నారు.