కొత్త మోటారు చట్టం ఎఫెక్ట్ : కుమారుడిని గదిలో బంధించిన తండ్రి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్...
లక్నో : కొత్త మోటారు వాహన చట్టం మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు రేపుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ వైపు నుంచి ట్రాఫిక్ పోలీసులు వచ్చి .. చలానా వేస్తారేమోనని భయపడుతున్నారు. ఇకా తమ పిల్లలకు వాహనాలు ఇచ్చేందుకు గజ గజ వణుకుతున్నారు. కనీస చలాన్ రూ.25 వేల వరకు ఉండటంతో .. పిల్లలకు టూవీలర్ ఇచ్చేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు పేరెంట్స్. ఇటీవల యూపీలోని ఆగ్రాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అయితే ఆ పిల్లాడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం సృష్టించింది.
చలానాకు భయపడి
ఆగ్రాకు చెందిన దరమ్ సింగ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. అతనికి భార్య, 16 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భార్య కూడా విధులు నిర్వహిస్తోంది. కుమారుడు మాత్రం ఏ పని చేయకుండా తిరుగుతుంటాడు. కుమారుడు బలవంతం మేరకు రెండేళ్ల క్రితం సింగ్ .. టూవీలర్ కూడా కొనుగోలు చేశాడు. కానీ ఇటీవల కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఏకంగా వేలకు వేలు ఫైన్ బాదుతున్నారు. దీంతో ధరమ్ సింగ్ భయపడ్డారు. తన భార్యతో మాట్లాడి .. కుమారుడికి బైక్ కీ ఇచ్చేవారు కాదు. దీనిపై తల్లిదండ్రులు, కుమారుడి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఒక్కసారి దొరికితే రూ.25 వేల వరకు జరిమానా వేస్తుండటంతో వారు భయపడ్డారు.
ఇదీ ప్లాన్ ..
ఇక లాభం లేదనుకొని ఒక ప్రణాళిక వేశారు ధరమ్ సింగ్ దంపతులు. తమ కుమారుడిని ఇంట్లో ఉంచి తాళం వేసి ఆఫీసుకు వెళ్లేవారు. తమతోపాటు టూ వీలర్ కీ కూడా తీసుకెళ్లేవారు. దీంతో అతని కుమారుడు తండ్రీకి తగ్గ కుమారుడు అనిపించుకేనే ప్రయత్నం చేశాడు. తనను ఇంట్లో ఉంచి తాళం వేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్న తండ్రిపై కంప్లైంట్ చేసి .. సంచలనం సృష్టించాడు. ఏంటి అని పోలీసులు ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది. వారిద్దరినీ పిలిపించి మాట్లాడితే .. జరిగిన విషయం చెప్పారు. దీంతో వారిద్దరినీ పోలీసులు మందలించి వదిలేశారు. మరోసారి ఇలాంటి ఘనట జరగకుండా చూసుకోవాలని బెదిరించి .. విడిచిపెట్టారు.
తిరగబడ్డ ప్రణాళిక ..
కొత్త మోటారు వాహన చట్టం .. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. టూ వీలర్కు హెల్మెట్, వివిధ పేర్లు చెప్పి వేలకు వేలు ఫైన్ వేస్తున్నారు. తమ వాహనానికి కూడా ఫైన్ వేస్తారెమోనని ధరమ్ సింగ్ భయపడ్డారు. అసలే తమది మధ్యతరగతి కుటుంబమని .. వేలకు వేలు ఎక్కడినుంచి కట్టాలని వాపోయాడు. తన భార్యతో మాట్లాడి ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాడు. దీనికితోడు తమ కుమారుడు మైనర్ అని .. ఈ పేరుతో ఎక్కువ ఫైన్ వేస్తారని భావించారు. కానీ వారొకటి అనుకుంటే .. కొడుకే కేసు పెట్టడం కలకలం రేపింది.