వీళ్ల తలనొప్పి ఎందుకు: మహారాష్ట్రలో ఇక ఒంటరిపోరేనన్న అమిత్ షా
మహారాష్ట్ర: శివసేనతో ఏ ముహూర్తానా బీజేపీ పొత్తు పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ... ఇక అప్పటి నుంచి మహారాష్ట్రలో శివసేన పార్టీ బీజేపీకి పక్కలో బళ్లెంలా తయారైంది. పేరుకు మాత్రమే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ నిత్యం బీజేపీని టార్గెట్ చేస్తున్నారు శివసేన నాయకులు. తాజాగా జరిగిన అవిశ్వాసతీర్మానంలో ఓటింగ్కు శివసేన దూరంగా ఉన్నింది. శివసేన వ్యవహారశైలిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇక ఈ తలనొప్పి తమకొద్దనే నిర్ణయానిక వచ్చేశారు. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడుదామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ ప్రసంగాన్ని శివసేన నేతలు పొగడటం... బీజేపీకి మద్దతు ఇవ్వలేమని చెప్పడం అమిత్ షాకు రుచించలేదు. దీంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు కార్యకర్తలు సమాయత్తమవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అమిత్ షా 23 పాయింట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు.
ఒంటరిగానే బీజేపీ ఎన్నికల్లో పోటీచేసి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంలో కానీ అటు మోడీ ప్రభుత్వంలో కానీ శివసేన ఇంకా ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు బాహాటంగానే బీజేపీ, మోడీపై బహిరంగ విమర్శలు చేస్తుండటం కమలం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.
గత శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానానికి కొన్ని గంటల ముందు తాము ఓటింగ్లో పాల్గొనబోవడం లేదని ప్రకటించి శివసేన పార్టీ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. ఇక శివసేనకు చెక్ పెట్టాలని భావించిన బీజేపీ అధిష్టానం... ఏక్ బూత్ 25 యూత్ అనే నినాదంతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని అమిత్ షా తెలిపారు. అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ నినాదం ఉంచాలని కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు.
అంతేకాదు ప్రతీ బూత్లో మోటార్ బైకులపై ఐదు మంది కార్యకర్తలు తిరిగి బీజేపీ కోసం ప్రచారం చేయాలని సూచించారు. అంతేకాదు ఆయా బూత్ల పరిధిలో వచ్చే ఆలయాలు, వాటి పూజారులు, మసీదులు జాబితా తయారు చేయాలని కోరారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల సమాచారం సేకరించాలని ఆదేశించిన అమిత్ షా... ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు.