శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఈ మహిళా ముఖ్యమంత్రి బరువు తగ్గాలట..!
సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే బరువు పెరుగుతున్నందున ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యాదవ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన నాలుక కరుచుకున్నారు. ఆ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదని తాను కేవలం జోక్ చేసినట్లు చెప్పారు శరద్ యాదవ్. అంతే తప్ప వసుంధర రాజే మనసును నొప్పించే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని చెప్పారు.
రాజస్థాన్లోని అల్వార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శరద్ యాదవ్ వసుంధరా రాజేకు విశ్రాంతి ఇవ్వాలని చెబుతూ ఆమె చాలా అలసిపోయి ఉన్నారన్నారు. కొన్నేళ్ల ముందు ఆమె చాలా సన్నగా ఉండేవారని ఇప్పుడు శరీరం బరువు బాగా పెట్టారంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు శరద్ యాదవ్. శరద్ యాదవ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు శరద్ యాదవ్.
వసుంధర రాజే తనకు చాలాకాలంగా తెలుసునని తను కేవలం జోక్ చేశానని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇబ్బందిపెట్టేందుకు కాదని చెప్పారు. అంతేకాదు గతంలో తనను కలిసినప్పుడు కూడా బరువు పెరుగుతున్నారని తను స్వయంగా వసుంధర రాజేకే చెప్పినట్లు శరద్ యాదవ్ తెలిపారు.
ఇదిలా ఉంటే శరద్ యాదవ్ వ్యాక్యలపై తీవ్రంగా స్పందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే. తన శరీర ఆకృతిపై చేయకూడని వ్యాఖ్యలు చేసి తనను అవమానించిన శరద్ యాదవ్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వసుంధరా రాజే డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నేతలు నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే శరద్ యాదవ్ పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది యావత్ మహిళాలోకానికి జరిగిన అవమానంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు.