ముంబై పేలుళ్లకు గర్వపడుతున్నా: భత్కల్, చింతలేదని
‘పేలుళ్లకు పశ్చాత్తాపడటం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలుచుకున్నా' అని ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో భత్కల్ చెప్పాడు. అతడి సహాయకుడు అసదుల్లా అక్తర్ కూడా పేలుళ్లకు పాల్పడినందుకు చింతించడం లేదని నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవడానికి 2005 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాము నిర్వహించిన పేలుళ్ల వివరాలను వారు వెల్లడించారు. వీరిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం జూన్ 16న 300 పేజీలతో కూడిన అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.
భత్కల్ను, అసదుల్లా అక్తర్ను కస్టడీలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు అనుమతించడంతో మహారాష్ట్ర ఏటిఎస్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 5న వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏటిఎస్ ప్రకారం.. 2011, జులై 13న ముంబైలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు భత్కల్ కీలక కుట్రదారు. కాగా, భక్తల్, అక్తర్లను జాతీయ దర్యాప్తు సంస్థ నిరుడు ఆగస్టులో భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.