సవతి కొడుకులా: బీజేపీపై ఎంపీ శత్రుఘ్న సిన్హా సంచలనం, వేటేయాలంటే లేఖలు
పాట్నా: భారతీయ జనతా పార్టీపై ఆ పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నతల్లిలాంటి పార్టీ ఇప్పుడు తనపై సవతి ప్రేమను చూపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
గత కొంతకాలంగా ఆయన సొంత పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సవతి కొడుకులా..
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ పార్టీ నాకు అమ్మలాంటిది. కానీ, సొంత పార్టీ నేతలే నాపై సవతి ప్రేమను చూపిస్తూ నన్ను దూరం పెడుతున్నారు. మాట్లాడటం తప్పించి పార్టీ కోసం ఏ పని చేయలేకపోతున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే నన్ను అణిచివేస్తున్నారేమో అనిపిస్తోంది' అని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.
అప్పుడు ఎక్కువే విమర్శలు.. అయినా
అంతేగాక, ‘గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పార్టీపై ఇంతకన్నా ఎక్కువే విమర్శలే చేశాను. అయినా టికెట్ దక్కింది కదా!. ఇప్పుడు కూడా అంతే' తనకు పార్టీ టికెట్ వచ్చే వంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఇక బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రైతులు, నిరుద్యోగుల హక్కుల సాధనకై ‘రాష్ట్ర మంచ్' అనే రాజకీయ వేదికను స్థాపించిన విషయం తెలిసిందే. అందులో తాను కూడా చేరటంపై శత్రుఘ్న స్పందించారు.
ఇద్దరం బీజేపీలోనే
'రాష్ట్ర మంచ్' రాజకీయ పార్టీ కాదని.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించటం.. సమస్యలపై పోరాటం కోసమే ఏర్పాటు చేసిందని శత్రుఘ్న సిన్హా చెప్పారు. తానూ, యశ్వంత్ సిన్హా ఇద్దరమూ బీజేపీలోనే ఉన్నామని శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు.
సిన్హాపై వేటేయాలంటూ..
ఇది ఇలావుంటే శృతిమించుతున్న విమర్శల కారణంగా వీరిద్దరి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని పార్టీకి విన్నవిస్తున్నారు పలువురు నేతలు. యశ్వంత్, శత్రుఘ్న సిన్హాలపై వేటు వేయాల్సిందేనని పలు రాష్ట్రాల విభాగాలు అధిష్ఠానానికి ఇప్పటికే లేఖలు రాయడం గమనార్హం.