శశికళకు భారీ దెబ్బ: జైల్లోనే వీడియో కాన్ఫరెన్స్ విచారణ: 20 ఏళ్ల కేసులో!
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను విచారించడానికి చెన్నైలోని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.
చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ మెడకు మరో కేసు విచారణ చుట్టుకుంది. ఆమెను కచ్చితంగా విచారించాలని ఈడీ అధికారులు పట్టుబట్టడంతో ఇప్పుడు చిన్నమ్మ కేసు విచారణ ఎదుర్కోక తప్పడం లేదు.
మీడియాకు చిక్కకుండా రమ్య పరుగో పరుగు: ఐటీ శాఖ అధికారుల ముందు హాజరు!
విదేశాలకు అక్రమంగా నగదు ఎగుమతి చేశారని, నియమాలు ఉల్లంఘించి ఆర్థికలావాదేవీలు చేశారని ఆరోపిస్తూ 20 ఏళ్ల క్రితం శశికళ నటరాజన్, ఆమె మేనళ్లుడు టీటీవీ దినకరన్, ఆయన సోదరుడు టీటీవీ భాస్కరన్ ల మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
తప్పించుకున్న చిన్నమ్మ
నియమాలు ఉల్లంఘించి విదేశాలకు నగదు లావాదేవీలు జరిగాయని 20 ఏళ్ల క్రితం శశికళ, టీటీవీ దినకరన్, టీటీవీ భాస్కరన్ ల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నుంచి శశికళకు విముక్తి లభించింది.
చిన్నమ్మని వదలని అధికారులు
అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈడీ అధికారులు పై కోర్టులో అర్జీ సమర్పించారు. ఫెరా కేసులో బెంగళూరులో జైల్లో ఉన్న శశికళను విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు మద్రాసు హైకోర్టులో అర్జీ సమర్పించారు.
ఇరు వర్గాల వాదనలు
ఇప్పటికే ఫెరా కేసుకు శశికళకు ఎలాంటి సంబంధం లేదని రుజువు అయ్యిందని, ఆమెను ఇంకా విచారించడం భావ్యంకాదని ఆమె తరుపు న్యాయవాదులు కోర్టులో వాదన విన్నవించారు. అయితే శశికళను విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో మనవి చేశారు.
కేసులో ముగ్గురు, ఇద్దరు జైల్లో
గురువారం చెన్నైలోని ఎగ్మూరు కోర్టులో ఫెరా కేసు విచారణ జరిగింది. కేసు విచారణకు టీటీవీ భాస్కరన్ మాత్రం హాజరైనారు. ఎన్నికల కమిషన్ కు రూ. 59 కోట్ల లంచం ఎర వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉండటంతో ఆయన విచారణకు హాజరుకాలేదు.
మళ్లీ రావాలని టీటీవీ భాస్కరన్ కు ఆదేశాలు
కేసు విచారించిన ఎగ్మూరులోని ప్రత్యేక కోర్టు ఈనెల 10వ తేదిన మళ్లీ కోర్టు ముందు హాజరుకావాలని టీటీవీ భాస్కరన్ కు ఆదేశించింది. అదే రోజు టీటీవీ భాస్కరన్ కు క్రాస్ ఎగ్జామిన్ చెయ్యడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఈ కేసులో ఉన్న టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
శశికళను విచారించడానికి అనుమతి ఇవ్వండి
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నశశికళను విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు ఎగ్మూరులోని ప్రత్యేక కోర్టులో గురువారం మనవి చేశారు. శశికళకు ఈ కేసుతో సంబంధం ఉందని మా దగ్గర బలమైన సాక్షాలు ఉన్నాయని ఈడీ అధికారులు కోర్టులో మనవి చేశారు.
ఓకే చెప్పిన ఎగ్మూరు కోర్టు
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను విచారించడానికి చెన్నైలోని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళను విచారించి వివరాలు సేకరించాలని ఈడీ అధికారులకు కోర్టు సూచించింది.