దీపావళి ఎఫెక్ట్: బంగారు వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పసిడికి డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు పెరిగి రూ.32,650కి చేరుకుంది. ఓవర్సీస్లో బంగారం ధరలు పడిపోయినప్పటికీ మనదేశంలో మాత్రం పండగ కారణంగా పెరిగిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోల్చితే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి రూ.39,530గా ఉంది.
బంగారం ధరలు స్వల్పంగా పెరగడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు వివరించారు. దీపావళి పండగ కారణంగా పసిడికి డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు విపరీతంగా బంగారును కొనుగోలు చేశారని చెప్పారు. అయితే మార్కెట్లు బలహీనపడటంతో బంగారు ధరలు పెరిగాయని వారు చెబుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో 99.9 ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 32.650 ఉండగా... 99.5 స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ.32,500గా ఉంది. రెండిటి మధ్య తేడా రూ. 150గా ఉంది. ఇదిలా ఉంటే 8గ్రాముల బంగారం ధర రూ.24,900గానే ఉండి ఎలాంటి పెరుగుదల నమోదు చేయలేదు. ఇక వెండి ధర శుక్రవారంతో పోలిస్తే రూ.30 పెరిగింది. కిలో వెండి ధర రూ.39,530గా ఉంది. ఇక వెండి నాణేలు కొనుగోలు, అమ్మకాల విలువ మారలేదు. 100 వెండి నాణేల ధర కొనుగోలు చేయాలంటే రూ.76వేలు ఉండగా.. అదే అమ్మాలంటే రూ.77వేలుగా ఉంది.