అండర్ వరల్డ్ డాన్ ఇంటర్వ్యూ: మీడియాకు నోటీసులు
బెంగళూరు: మాఫియా ముఠా నాయకుడిని ఇంటర్వూ చేసి వివాదాస్పద వ్యాఖ్యల క్లిప్పింగ్ లు ప్రసారం చేసిన నాలుగు టీవీ చానెల్స్ రిపోర్టర్లు, ఆ కార్యక్రమాలు ప్రసారం చేసిన ప్రోగ్రామర్లకు కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు.
విచారణకు హాజరు కావాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాఫియా డాన్ బెన్నంజే రాజాను విదేశాలలో అరెస్టు చేసి భారత్ కు తీసుకు వచ్చారు. అతను ప్రస్తుతం ఉడిపి జిల్లా జైలులో ఉన్నాడు. ఇతని మీద అనేక హత్య కేసులతో పాటు పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బెన్నంజే రాజా విదేశాలలో తలదాచుకుని దందాలు చేస్తూ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను భయపెట్టి చంపేస్తామని బెదిరిస్తూ వారి దగ్గర హఫ్తా వసూలు చేస్తున్నాడు. ఇంటర్ పోల్ సహకారంతో ఇతనిని అరెస్టు చేసి భారత్ తీసుకు వచ్చారు.
తరువాత నాలుగు టీవీ చానెల్స్ రిపోర్టర్లు బెన్నంజే రాజాను ఇంటర్వూ చేశారు. ఆ సందర్బంలో బెన్నంజే రాజా కర్ణాటకలోని ఆంకోలాలోని ప్రముఖ మైనింగ్ వ్యాపారి ఆర్.ఎన్. నాయక్ ను తానే హత్య చేయించానని ఆ ఇంటర్వూలో అంగీకరించాడు.
ఇక ముందు మీ టార్గెట్ ఎవరూ అని విలేకరులు ప్రశ్నించగా ఇప్పటికే తాను చాల మందికి వార్నింగ్ ఇచ్చానని, ఈ ఇంటర్వూ టీవీలో చూసిన తరువాత వారిలో మార్పు వచ్చి నేను చెప్పినట్లు చేస్తారని అనుకుంటున్నానని బెన్నంజే రాజా అన్నాడు.
ఇదే సందర్బంలో పరోక్షంగా అతను వేరే వారికి హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈవిషయం తెలుసుకున్న ఉడిపి జిల్లా ఎస్పీ అణ్ణామలై నాలుగు టీవీ చానెళ్లకు వేరు వేరుగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.
నాలుగు చానెళ్ల ప్రతినిధుల మీద కోకా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మాఫియా డాన్ బెన్నంజే రాజాను పరోక్షంగా వీరు ప్రోత్సహిస్తున్నారని పోలీసు శాఖ అధికారులు అంటున్నారు. అయితే టీవీ చానెల్ ప్రతినిధులు ఇప్పటికే మంగళవారం ఒక సారి విచారణకు హాజరైనారు.