మతంపై కాదు, ఉగ్రవాదంపై పోరాడండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: మతంపై కాకుండా ఉగ్రవాదంపై పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. యువతను తప్పదారి పట్టించే మైండ్ సెట్పై పోరాటం చేయాలని ఆయన అన్నారు.
ప్రతి మతమూ మానవ విలువలను ప్రోత్సహిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ వారసత్వం, అవగాహన పెంపు అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జోర్డాన్ రాజు రెండో అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.
ప్రపంచంలోని ప్రతి ప్రధాన మతానికి భారతదేశంలో స్థానం ఉందని మోడీ అన్నారు. ప్రాచీన బహుళ విధానానికి భారత ప్రజాస్వామ్యం ఉత్సవం వంటిదని అన్నారు. అన్ని విశ్వాసాలు కూడా మానవ విలువలను బోధిస్తాయని చెప్పారు.
మన యువత ఇస్లాంలోని మానవతావాద ధోరణులను అలవరుచుకోవాలని, ఆధునిక సాంకేతికతను వాడుకోవడం నేర్చుకోవాలని ఆనయ అన్నారు.
విశ్వాసం మానవులు కలిసికట్టుగాఉండడానికి ఉపయోగపడాలని రాజు రెండో అబ్దుల్లా అన్నారు. కలుపుగోలుతనమే అన్నిసమస్యలకు రక్షణకవచమని అన్నారు.
మతం పేర మానవత్వంపై దాడి చేయడం మతాన్ని దెబ్బ తీయడమేనని మోడీ అన్నారు. మతం పేరు మీద మానవులపై దాడి చేయడం మతంపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. తాము కట్టుబడి ఉన్నామని చెబుకుంటున్న మతంపై దాడి చేయడమేనని అన్నారు.
ఉగ్రవాద శక్తులపై పోరాటానికి సాంకేతిక పరిజ్ఢానాన్ని, మతాన్ని జోడించాలని అన్నారు. భారతదేశంలోని ముస్లింలు ఓ చేతితో ఖురాన్, మరో చేత్తో కంప్యూటర్ పట్టుకుంటున్నారని అన్నారు.