ఢిల్లీలో కత్తితో సర్దార్జీ వీరంగం.. పట్టుకోవడానికి వచ్చి పరుగులు తీసిన పోలీసులు
ఢిల్లీ : ఆదివారం సాయంత్రం 6గంటల సమయం. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతం. నిత్యం బిజీగా ఉండే రోడ్డుపై ఓ పోలీసు జీపును టెంపో ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయినా పోలీసు జీపును ఢీకొట్టాడన్న కారణంతో ఖాకీలు రెచ్చిపోయారు. లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు టెంపో డ్రైవర్ టెంపో నుంచి కత్తి బయటకు తీశాడు. పోలీసులు వెంటపడి పరుగులు పెట్టించాడు.
పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యాసిడ్ దాడి
కత్తితో సర్దార్జీ వీరంగం
పోలీసు జీపును ఢీకొట్టడంతో ఘర్షణ మొదలైంది. టెంపో డ్రైవర్తో పాటు అతని కొడుకును బయటకులాగిన పోలీసులు వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. కాసేపు ఓపిక పట్టిన డ్రైవర్ ఆ తర్వాత పోలీసులు మాట వినకపోవడంతో టెంపోలో ఉన్న కత్తి బయటకు తీసి వీరంగా సృష్టించాడు. దీంతో ఓ పోలీసు పక్కనే ఉన్న స్టేషన్లోకి వెళ్లి మరింత మంది సిబ్బందిని వెంటపెట్టుకు వచ్చాడు. కత్తి పట్టుకున్న టెంపో డ్రైవర్ వాళ్ల వెంటపడటంతో పోలీసులు పరుగులు తీశారు. కాసేపటికి డ్రైవర్ను పట్టుకున్న ఖాకీలు అతనిపట్ల దారుణంగా వ్యవహరించారు. లాఠీలతో చావ చితక్కొట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాళ్లతో తన్ని.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి...
టెంపో డ్రైవర్తో పాటు అతని కుమారుడిపైనా పోలీసులు ప్రతాపం చూపారు. తన తండ్రిని రక్షించే ప్రయత్నంలో అడ్డుపడ్డ యువకున్ని లాఠీలతో చావబాదారు. కాలి బూట్లతో తన్నుతూ, పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుపై ఈడ్చుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. దాదాపు అరగంట పాటు పోలీసులు డ్రైవర్ అతని కొడుకుపై లాఠీలతో ప్రతాపం చూపడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులపై కత్తి దూసే ప్రయత్నం తప్పే అయినప్పటికీ ఖాళీలు వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. క్రూరంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
టెంపో డ్రైవర్ దాడిలో ఒక పోలీస్ ఆఫీసర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల టెంపో డ్రైవర్ను చావచితకబాదిన వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో విధి నిర్వాహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన డీసీపీ నివేదిక ఆధారంగా వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టెంపో డ్రైవర్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.