కశ్మీర్ కోసమే యుద్ధం.. కశ్మీరీలపై కాదు: రాజస్థాన్లో ప్రధాని మోడీ
టోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్లోని టోంక్లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీలపై దాడులను ఆయన ఖండించారు. అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ... ఉగ్రవాదంపై పోరాడేందుకు కశ్మీరీ యువతను తయారు చేయాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఉగ్రవాదం బారిన బాధితులుగా మారుతున్న కశ్మీరీలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు ప్రధాని మోడీ.
"పుల్వామా దాడుల తర్వాత కశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయి. అలాంటివి ఇకపై జరగకూడదు. ఉగ్రవాదం బారిన పడి వారు కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ప్రతి కశ్మీర్ విద్యార్థి అండగా ఉంటున్నాడు" అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడులపై పాకిస్తాన్ను ప్రధాని మోడీ హెచ్చరించారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోను మౌనంగా ఉండబోదని సరైన సమయంలో ధీటైన సమాధానం ఇస్తామని మోడీ చెప్పారు.
"పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టగానే ప్రోటోకాల్లో భాగంగా ఆయనకు ఫోన్ చేశాను. ఇప్పటి వరకు భారత్ పాక్ దేశాలు యుద్ధాలే చేశాయి. ఇక నుంచి పేదరికం, నిరక్షరాస్యతపై యుద్దం చేద్దామన్నాను. ఖాన్ నాడు మాట ఇచ్చారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి చూద్దాం ఇమ్రాన్ ఖాన్ తన మాటపై నిలబడుతాడో లేదో" అని మోడీ అన్నారు. అంతేకాదు పాకిస్తాన్కు మద్దతుగా అక్కడక్కడ కొన్ని తుకుడా తుకుడా గ్యాంగ్లు ఉన్నాయని వారందరినీ ఏరిపారేస్తామని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్తాన్పై వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటామని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు ఉగ్రవాదులుగానే ఉన్నారని వారు మారరని చెప్పిన ప్రధాని కశ్మీరీలు ఉగ్రవాదం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారని మోడీ చెప్పారు.