అప్పుడే చెడిందా.. ఆ సంగతి బీజేపీకి కూడా తెలిసిపోయింది... అందుకే బీహార్ ఎన్నికల్లో ఇలా...
ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు... ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాయి... అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న సీన్ మాత్రమేనా... లోలోపల పరస్పర వ్యతిరేక వైఖరితో పనిచేస్తున్నాయా... బీహార్ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీలను చూస్తుంటే ఈ సందేహాలు కలగకమానవు. ఎన్నికల తర్వాత నితీశ్ను ఏకాకిని చేసేందుకే ఎల్జేపీని బీజేపీ 'బీ' టీమ్గా బరిలో దింపిందన్న చర్చ జరుగుతోంది. బీహార్ ప్రజల్లో నితీశ్పై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్న విషయాన్ని ముందే పసిగట్టిన బీజేపీ... సేఫ్ సైడ్గా ఎల్జేపీతో జేడీయూని టార్గెట్ చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు జేడీయూ కూడా పేరుకు బీజేపీతో కలిసి సాగుతున్నప్పటికీ.. బీజేపీ విధానాల పట్ల లోలోపల తీవ్ర వ్యతిరేకతను గూడు కట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..
బీజేపీ ప్రకటనలో నితీశ్ ఎక్కడ..?
ఎన్నికల్లో పోటీ చేసే మిత్రపక్షాలు... మిత్ర ధర్మ ప్రకారం కలిసే ముందుకు సాగాలి. కానీ బీహార్ ఎన్డీయే కూటమిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. బీజేపీ,జేడీయూ పార్టీలు పైకి మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నప్పటికీ.. ఎక్కడో తేడా కొడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు పార్టీలు ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఒకరినొకరు విస్మరించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. బీజేపీ పలు పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వగా... అందులో ప్రధాని మోదీ ఫోటో తప్ప ఎక్కడా నితీశ్ ఫోటో గానీ జేడీయూ ప్రస్తావన గానీ లేదు. కేవలం బీజేపీ ఎన్నికల హామీలను మాత్రమే పేర్కొన్నారు.
జేడీయూ ప్రకటనలో మోదీ ఎక్కడ?
ఇటు జేడీయూ కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఆ పార్టీ పత్రికా ప్రకటనల్లో నితీశ్ ఫోటోలే తప్ప ఎక్కడా ప్రధాని మోదీ ఫోటో గానీ బీజేపీ ప్రస్తావన గానీ లేదు. ఈ రెండు పార్టీల ప్రకటనలు చూసిన జనాలు... ఎన్నికలకు ముందే వీరికి చెడిందా అని చర్చించుకుంటున్నారు. అటు ప్రత్యర్థులు తేజస్వి యాదవ్,చిరాగ్ పాశ్వాన్లకు కూడా ఇదో అస్త్రంగా మారింది. నితీశ్ పాపులారిటీ తగ్గిందన్న విషయం బీజేపీకి కూడా తెలిసిపోయిందని... అందుకే ఆయన్ను ఎన్నికలకు ముందే పక్కనపెట్టిందని విమర్శిస్తున్నారు.
Recommended Video
నితీశ్కే దెబ్బ..?
బీజేపీ,జేడీయూల తీరు చూస్తుంటే రెండు పార్టీలు ఉద్దేశపూర్వకంగానే తమ ప్రకటనల్లో ఒకరినొకరు విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఇలా విబేధాలను బయటపెట్టుకోవడం భారీ మూల్యానికి దారితీస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ వెలువడ్డ రెండు సర్వేలు ఎన్డీయే గెలుపును అంచనా వేయగా... నితీశ్ పాపులారిటీ తగ్గినట్లుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనకు దూరం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినా... జేడీయూ సత్తా చాటకపోతే ఆ గెలుపు మోదీ చలవే అని బీజేపీ చెప్పుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నితీశ్ వల్లే ఓడిపోయామన్న సాకు కూడా దొరుకుతుంది. ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో ఒకవేళ ఆ పార్టీ సత్తా చాటితే బీజేపీకి లాభిస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. కాబట్టి ఎటొచ్చి నితీశ్కే ఈ ఎన్నికలు పెద్ద సవాల్గా మారాయి. మునుపెన్నడూ లేనంత ప్రతికూలత నడుమ ఈసారి ఆయన ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.