సత్యం స్కాం తుది తీర్పు: ఆరు కేసుల్లో.. జైలు శిక్షలు, జరిమానాలు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో ఆర్థిక నేరాల దర్యాఫ్తు సంస్థ సోమవారం తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు రకాల కేసులను పెట్టగా.. ఆరు కేసులకు సంబంధించిన తీర్పును ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు వెలువరించింది. ఒక కేసును కొట్టివేసింది.
రామలింగ రాజు, రారాజులకు 5 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నాలుగు కేసుల్లో ఒక్కో దానికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. రామ్ మైనంపాటికి 3 కేసుల్లో ఆర్నెళ్ల జైలు శిక్ష చొప్పున విధించింది. రూ.10 లక్షల జరిమానాను విధించింది.
సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ జి పాలెపు, శ్రీనివాస్, వినోద్ కె దామ్, టీఆర్ ప్రసాద్లకు రూ.20వేలు చొప్పున జరిమానా విధించింది. వడ్లమాని శ్రీనివాస్కు 3 కేసుల్లో ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది.
కాగా, తీర్పు పైన నెల రోజుల పాటు అప్పీలుకు అవకాశం ఇచ్చింది. కాగా, ఐదేళ్ల క్రితం 2009 సంవత్సరంలో సత్యం కుంభకోణం బయటపడింది. ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపేసింది. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా రామలింగ రాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు.
అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాత నుండి కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు తుది తీర్పు వెలువడింది. అప్పీలుకు అవకాశం ఇచ్చింది.