అత్యాధునిక ఆయుధాలు-3 బిలియన్ డీల్: మర్చిపోలేనన్న ట్రంప్, సంతోషమన్న మోడీ
న్యూఢిల్లీ: అమెరికా, భారత్ సంబంధాలు 21వ శతాబ్దానికి ఎంతో ముఖ్యమైనవని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక సమావేశం జరిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కుదిరాయి. అనంతరం ఉమ్మడి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.
Recommended Video
రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం..
ట్రంప్ సకుటుంబంగా భారత్ రావడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. గడిచిన 8 నెలల్లో ట్రంప్తో ఐదుసార్లు సమావేశమైనట్లు ఆయన తెలిపారు. దౌత్య సంబంధాల్లో రక్షణ సహకారం కీలకమైందని అన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించామని మోడీ తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో కలిసి సాగాలని నిర్ణయించామని ప్రధాని మోడీ తెలిపారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారీ ఒప్పందాలపై చర్చ
ఉగ్రవాద ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామని మోడీ వెల్లడించారు. మూడు కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం గురించి చర్చించినట్లు ప్రధాని తెలిపారు. సమాన అవకాశాలతో కూడిన స్వేచ్ఛాయుత వాణిజ్యంపై ర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతాయని చెప్పారు. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరనున్నాయని తెలిపారు. నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందాలపై చర్చించినట్లు తెలిపారు.
ఇరు దేశాల ప్రజల మధ్య బంధమే..
మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్ వంటి అంశాలపై సంయుక్తంగా పోరాడతామన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు. అణు ఇంధన రంగాల్లో రెండు దేశాల బంధం బలోపేతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ప్రజలతోనే సంబంధం ఏర్పడిందన్నారు.
మర్చిపోలేని పర్యటన అంటూ ట్రంప్..
అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. భాతర పర్యటన తమకు ప్రత్యేకమైనదని అన్నారు. తమకు ఇండియాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఈ పర్యటనను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇది రెండు దేశాలకు ఎంతో ఉపయోగకరమైన పర్యటన అని చెప్పారు. భారత్ గొప్ప మానవ సంబంధాలను కలిగివుందని అన్నారు.
రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం..
ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పోరాడతాయని ట్రంప్ అన్నారు. ఇస్లాం తీవ్రవాదాన్ని అణిచివేస్తామన్నారు. సహజ ఇంధన రంగంలో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. భారత్తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు.
హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తన కూతురు ఇవాంకా ట్రంప్ గతంలో పాల్గొన్నారని, ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రపై చర్చించారని అన్నారు. భారత్తో రక్షణ పరికరాల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ ఒప్పందంతో భారత రక్షణ రంగంలోకి అత్యాధునిక ఆయుధాలు చేరనున్నాయి. దీంతో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టనుంది భారత్.