నిర్భయ దోషులకు చనిపోయే వరకూ ఉరి: శిక్ష ఆలస్యమైందని గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీతపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. 'చివరికి.. చనిపోయేవరకూ ఉరితీశారు.. నాకు తెలుసు.. నిర్భయ విషయంలో చాలా ఆలస్యం జరిగింది' అని ట్విట్టర్ వేదికగా గంభీర్ వ్యాఖ్యానించారు.
2012, డిసెంబర్ 16న 23ఏళ్ల నిర్భయ, ఆమె స్నేహితుడు దక్షిణ ఢిల్లీలో ఒక బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆరుగురు దుండగులు వీరిపై దాడి చేశారు. అనంతరం నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు.
కాగా, తీవ్రగాయాలపాలైన నిర్భయ 15 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. ఈ కేసులు నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5.30గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.
Hanged till death! Finally! I know we are late Nirbhaya. #NirbhayaJustice
— Gautam Gambhir (@GautamGambhir) March 20, 2020
ఇది ఇలావుండగా, నిర్భయపై దారుణంగా లైంగికదాడి చేసి.. చనిపోయేందుకు కారణమైన దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఎంత చిత్రవధతో చనిపోయిందో చూశానని.. దోషుల శిక్ష కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చివరికి ఇవాళ న్యాయం జరిగిందని తెలిపారు. తన కూతురికి జన్మనిచ్చానని.. కానీ కాపాడుకోలేకపోయానని విలపించారు. కానీ తన కూతురు మరణానికి కారణమైన వారికి మాత్రం శిక్ష విధించడంతో న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
Recommended Video
నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష అమలుపై ఆమె తండ్రి బద్రీనాథ్ సింగ్ స్పందించారు. దోషులకు శిక్ష విధించేందుకు చాలా సమయం తీసుకున్నారు... కానీ చివరికి తమకు న్యాయం జరిగిందని తెలిపారు. దోషులకు శిక్ష విధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఉరిశిక్షను స్వాగతించారు.