ట్రిపుల్ తలాక్కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణ
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అధ్యయనం చేసి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టానికి ఎట్టకేలకు ఎగువ సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. చట్టరూపం దాల్చేందుకు అడుగుదూరమే మిగిలి ఉంది. రాష్ట్రపతి ఆమోదం .. తర్వాత గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ అమల్లోకి వస్తోంది. ఎన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న బాధిత ముస్లిం మహిళలకు స్వాంతన చేకూరనుంది. బిల్లు చట్టరూపం దాల్చడంతో ఇక ట్రిపుల్ తలాక్ పేరు చెప్పాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. నిరాధారంగా నింద మోపి విడిపోతామంటే కుదరదు, ఆధారాలు చూపాలి .. అలా కాకుండా ప్రవర్తిస్తే సదరు వ్యక్తి ఊచలు లెక్కించాల్సిందే.
ఆమోదముద్ర
ఏదైనా బిల్లుకు పెద్దల సభయిన రాజ్యసభ ఆమోదం తప్పనిసరి. అయితే బిల్లును ప్రభుత్వం రూపొందించి తొలుత లోక్సభలో ప్రవేశపెడుతుంది. దిగువసభలో మెజార్టీ ఉంటుంది .. గనుక ఇబ్బంది లేదు. ఏ బిల్లు అయినా ఆమోదం తెలుపుతుంది. రాజ్యసభకొచ్చే సరికి మాత్రం పరిస్థితి అలా ఉండదు. మెజార్టీ సభ్యుల మద్దతు తప్పనిసరి. వాస్తవానికి ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభకు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇదివరకు కూడా వచ్చింది కానీ అప్పుడు విపక్షాలు కొన్ని సవరణలు చేయడంతో బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం పకడ్బందీగా ముందుకెళ్లింది. ఎన్డీఏ పక్షాల మద్దతుతో ఎట్టకేలకు ట్రిబుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకుంది మోడీ సర్కార్.
ఇదీ లెక్క
రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ శాశ్వత సభ, ఆరేళ్లకోసారి సభ్యులను నియమిస్తారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓట్ల ద్వారా సభ్యులు ఎన్నుకోబడతారు. కానీ ప్రస్తుతం 4 ఖాళీగా ఉండటంతో 241 సభ్యులతో సభ కొలువుదీరింది. అంటే సభకు 241 మంది హాజరైతే 121 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి 103 సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అంటే ప్రభుత్వ బిల్లు ఆమోదం పొందాలంటే 18 ఓట్లు తప్పనిసరి. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు దూరంగా ఉన్నారు. మరోవైపు సభ నుంచి బీఎస్పీ వాకౌట్ చేసింది. దీంతో అధికార ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసొచ్చింది. వీరి సభ నుంచి వెళ్లిపోవడంతో హౌస్లో కేవలం 183 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చించి స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు పాసైనట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
వీగిపోయిన ప్రతిపాదన
ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా అనే అంశంపై తొలుత ఓటింగ్ నిర్వహించారు. అయితే సెలెక్ట్ కమిటీ పంపితే సవరణలు చేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఓటింగ్ నిర్వహించగా పంపాల్సిన అవసరం లేదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీకి పంపాలని 84 మంది సభ్యులు ఓటేస్తే .. వద్దని 100 మంది సభ్యులు మద్దతిచ్చారు. దీంతో సెలెక్ట్ కమిటీకి పంపాలనే అంశం వీగిపోయింది. తర్వాత ట్రిపుల్ తలాక్కు ప్రతిపక్ష సభ్యులు సవరణలు కూడా ప్రతిపాదించారు. వాటిపై కూడా ఓటింగ్ నిర్వహించగా వీగిపోయింది. దీంతో ట్రిపుల్ తలాక్కు మోక్షం లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదలనుంది. గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ అమల్లోకి వస్తోంది.