స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్లకు వారసత్వ సంపద ఎలిఫెంటా ద్వీపానికి విద్యుత్ వెలుగులు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సమీపంలోని ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎలిఫెంటా ద్వీపం(గుహలు) స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ముంబై తీరానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘరాపురీ ద్వీపంలో ఉన్న ఎలిఫెంటా గుహల వద్ద నివసించే ప్రజలు తొలిసారి విద్యుత్ వెలుగులు చూడటం గమనార్హం.
యూనెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి సముద్ర గర్భంగా 7.5కి.మీ పొడవైన కేబుల్ను వేయడం ద్వారా ఈ దీవికి కరెంటు సరఫరా తొలిసారి అందుబాటులోకి వచ్చింది.
Electricity connection made accessible to Elephanta Island after 70 years of Independence; a 7.5 km long undersea cable brought electricity to three villages- Raj Bander, Mora Bander & Shet Bander #Maharashtra pic.twitter.com/95SfooC7PD
— ANI (@ANI) February 23, 2018
ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధన, ప్రత్యామ్నాయ ఇంధన శాఖల మంత్రి చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ.. ఇదో చారిత్రాత్మక రోజని, అరేబియా సముద్రంలోని మిగితా చిన్న దీవులకు కూడా ఇదే సదుపాయాన్ని అందిస్తామని చెప్పారు. విద్యుత్ సౌకర్యం కలగడంతో ఎలిఫెంటా గుహలకు మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఘరాపురీ దీవీలోని రాజ్ బందర్, షేత్ బందర్ గ్రామాల్లోని అన్ని ఇళ్లకు కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని మంత్రి తెలిపారు. మూడు గ్రామాల్లో కలిపి దాదాపు 950మంది నివసిస్తుండగా, వీరందరికి గుహల సందర్శనకు వచ్చే టూరిస్టుల ద్వారా లభించే ఆదాయమే జీవనమార్గం. కాగా, ఈ ప్రాంతంలో గత 30ఏళ్లుగా జనరేటర్లతో విద్యుత్ అందించారు.