బస్సు హైజాక్... రాత్రిపూట ఉలిక్కిపడ్డ ప్రయాణికులు... ఆగ్రాలో అనూహ్య ఘటన...
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూట ఓ ఫైనాన్స్ సంస్థ హైజాక్ చేసింది. ప్రయాణికులను ఏమీ చేయమని ముందే హెచ్చరించినప్పటికీ... ఏం జరుగుతుందో తెలియక వారు కంగారు పడ్డారు. ఎట్టకేలకు ఝాన్సీ ప్రాంతంలో వారిని దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉలిక్కిపడ్డ ప్రయాణికులు...
మంగళవారం(అగస్టు 18) హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్లోని పన్నాకు ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. బస్సు రాత్రి 11గంటలకు ఆగ్రా సమీపంలోకి వచ్చాక డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రెండు ఎస్యూవీ వాహనాల్లో వచ్చిన 8-9 మంది బస్సును అడ్డగించడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపక తప్పలేదు. తాము ఫైనాన్స్ కంపెనీ మనుషులమని... బస్సును అక్కడే నిలిపివేయాలని వారు డ్రైవర్కు చెప్పారు. అయితే డ్రైవర్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బస్సును మళ్లీ స్టార్ట్ చేశాడు.
బస్సు హైజాక్
డ్రైవర్ తమ మాట వినకపోవడంతో ఆ గ్యాంగ్ ఎస్యూవీ వాహనాల్లో బస్సును వెంబడించింది. చివరకు మల్పురా ప్రాంతంలో బస్సును అడ్డగించి... డ్రైవర్,కండక్టర్లను బలవంతంగా కిందకు దించారు. ప్రయాణికులు అరుపులు,కేకలు పెట్టవద్దని... మీకేమీ అపాయం లేదని ముందుగానే చెప్పారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు బస్సులోకి ఎక్కి హైజాక్ చేశారు. అనంతరం బస్సును ఢిల్లీ-కాన్పూర్ హైవే మీదుగా తీసుకెళ్లారు. బస్సు ఝాన్సీకి వెళ్లాక ప్రయాణికులను దింపేశారు. దీంతో వారు వేరే బస్సుల్లో తమ గమ్య స్థానాలకు బయలుదేరారు. మిగతా గ్యాంగ్ డ్రైవర్,కండక్టర్లను ఎస్యూవీ వాహనంలో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.
ఎవరా గ్యాంగ్....
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ గ్యాంగ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న ఓ ఫైనాన్స్ సంస్థకు చెందినవారు. ఆ బస్సు యజమాని కూడా గ్వాలియర్కి చెందినవాడే. ఆ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుని అతను బస్సును కొనుగోలు చేశాడు. మంగళవారం(అగస్టు 18) అతను కన్నుమూయగా... ఈఎంఐలు చెల్లించట్లేదన్న కారణంతో ఫైనాన్స్ సంస్థ మనుషులు బస్సును సీజ్ చేశారు. ఇప్పుడు ఆ బస్సు,డ్రైవర్,కండక్టర్ ఎక్కడ ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు.
కేసు నమోదు...
బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగానే బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. బస్సు నంబర్ను UP75M 3516 (ఇతవహ్,ఉత్తరప్రదేశ్)గా గుర్తించామని.. ప్రస్తుతం ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బస్సులో ప్రయాణికులు ఉండగానే దాన్ని సీజ్ చేసి వారిని భయభ్రాంతులకు గురయ్యేలా చేయడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.