కేంద్రం కీలక అడుగు, ఎన్నికల బాండ్లు: ఎలా పొందవచ్చో చెప్పిన జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయ ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక ప్రక్రియను తెరపైకి తీసుకు వచ్చింది. ఈ ప్రక్షాళనలో భాగంగా ఎన్నికల బాండ్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాజకీయ పార్టీలకు విరాళాల కోసం కొత్తగా జారీ చేయబోయే ఎన్నికల బాండ్ల తీరు తెన్నులను వెల్లడించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బిల్లు రూపకల్పన ఇలా
ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట శాఖల నుంచి వీటిని పొందవచ్చని మంగళవారం లోకసభలో చేసిన ప్రకటనలో జైట్లీ పేర్కొన్నారు. ఈ బాండ్లపై చెల్లింపుదారు పేరు ఉండదని చెప్పారు. రూ.వెయ్యి, రూ.10వేలు, రూ.లక్ష, రూ.10 లక్షలు, రూ.కోటి గుణకాలతో ఎంత మొత్తానికైనా బాండ్లు కొనుగోలు చేయవచ్చన్నారు.
బాండుగా పిలుస్తున్నప్పటికీ
దానిని బాండుగా పిలుస్తున్నప్పటికీ అది వడ్డీరహిత రుణ పత్రంగా ఉంటుందన్నారు. ప్రామిసరీ నోటు తరహాలో ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు ఆ సొమ్ము చేరే వరకూ దాత నిధులకు ఎస్బీఐ సంరక్షణదారుగా ఉంటుందన్నారు. ఈ బాండ్ల జీవితకాలం పదిహేను రోజులు అని చెప్పారు. ఆ లోగా వాటిని ఉపయోగించుకొని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు మాత్రమే విరాళాలివ్వాలన్నారు.
ఏ సమయాల్లో విక్రయానికి అంటే
గ్రహీతకు సంబంధించిన నిర్దిష్ట బ్యాంకు ఖాతా ద్వారానే బాండ్ను సొమ్ము చేసుకోవచ్చునని జైట్లీ చెప్పారు. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో పది రోజులు చొప్పున ఈ బాండ్లు అమ్మకానికి ఉంటాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఈ గడువును 30 రోజులకు పొడిగిస్తారు.
కేవైసీ వివరాలు ఇవ్వాలి
ఎస్బీఐకి కొనుగోలుదారు కేవైసీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. భారత పౌరులు కానీ దేశంలో నమోదైన సంస్థలు కానీ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. వీటి వల్ల రుణదాతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు.
పార్టీలకు విరాళాలకు ఈ బాండ్లు
బ్యాంకులను మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు ఈ బాండ్లు దోహదం చేస్తాయన్నారు. పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకుంటే బ్యాంకు నుంచి బాండ్లు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.
గత ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు నమోదైన పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల బాండ్లు అందుబాటులోకి వస్తాయని జైట్లీ తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు తమ బ్యాంకు అకౌంట్ వివరాలు అందచేయాల్సి ఉంటుందని, పదిహేను రోజుల్లోనే ఈ బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుందని, అలాగే, ఆయా రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో తమకు ఎంతమొత్తం విరాళంగా వచ్చిందీ ఈసీకి తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు.