శశికళ, దినకరన్ కు చెక్: సీన్ లోకి పళనిసామి, పన్నీర్ వర్గాలు, టార్గెట్ 2021, ఫోటోలు ప్రత్యక్షం !
తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న అన్నాడీఎంకే (అమ్మ) వెలివేత ఉప ప్రధాన కార్యదర్శి తన బలాన్ని పెంచుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న అన్నాడీఎంకే (అమ్మ) వెలివేత ఉప ప్రధాన కార్యదర్శి తన బలాన్ని పెంచుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. టీటీవీ దినకరన్ ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు.
షాక్: శశికళ ఫ్యామిలీ మీద పళనిసామి తిరుగుబాటు: 20 మంది మంత్రులు రివర్స్, మెడపట్టి !
ముగ్గురు ఎంపీలు సైతం ఆయన వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సైతం తన కుర్చీ కాపాడుకోవడానికి పావులుకదుపుతున్నారు. శశికళ, దినకరన్ తో సహ మన్నార్ గుడి మాఫియా ను దూరం పెట్టాలంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు అవసరం అని పళనిసామి వర్గీయులు అంటున్నారు.
పళనిసామి దూకుడు !
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ ను 22 మంది ఎమ్మెల్యేలు కలిశారని తెలిసిన వెంటనే ఎడప్పాడి పళనిసామి దూకుడు పెంచారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎడప్పాడి పళనిసామి దినకరన్ వర్గానికి సంకేతాలు పంపించారు.
సచివాలయంలో ఫోటోలు పత్యక్షం !
బుధవారం ఉన్నట్టుండి సచివాలయంలోని మంత్రుల చాంబర్లలో ఎడప్పాడి పళనిసామి ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. మంత్రుల చాంబర్లతో పాటు సచివాలయంలో ఎడప్పాడి పళనిసామి ఫోటోలు ఏర్పాటు చేశారు. నన్ను, నా సీఎం పదవిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పళనిసామి పరోక్షంగా దినకరన్ కు సంకేతాలు పంపించారు.
శశికళ, దినకరన్ లేకుండానే !
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచనలేకుండా పని చేస్తున్నదని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ అన్నారు. శశికళ, దినకరన్ ప్రమేయం లేకుండా 2012 వరకు మిగిలిన నాలుగేళ్లు అన్నాడీఎంకే ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి జయకుమార్ బాంబు పేల్చారు.
అంతా రహస్యంగానే !
27 మంది మంత్రులతో ఎడప్పాడి పళనిసామి భేటీ అయ్యారు. మంత్రి జయకుమార్ నేతృత్వంలో మంత్రులు అందరూ సీఎం పళనిసామిని కలిసి మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 17వ తేదీన శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి దూరం పెట్టాలని తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని సీఎంకు మంత్రులు మనవి చేశారని తెలిసింది.
పన్నీర్ సెల్వంతో దోస్తీ మంచిదే !
దినకరన్ కు 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనం పన్నీర్ సెల్వంను దగ్గరకు తీసుకోవడం మంచిదని పలువురు సీనియర్ నేతలు, మంత్రులు ఎడప్పాడి పళనిసామికి నచ్చ చెప్పారని తెలిసింది. పన్నీర్ సెల్వం దగ్గర అయితే దినకరన్ ను పూర్తిగా పార్టీ నుంచి బయటకు పంపించాలని మంత్రులు నిర్ణయించారని తెలిసింది.
దినకరన్ మద్దతుదారులు !
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నుంచి వెలివేతకు గురైన దినకరన్ ను ఎవరెవరు కలుస్తున్నారు ? అంటూ ఎడప్పాడి పళనిసామి ఆరా తీశారు. ఇప్పటికే దినకరన్ ను కలిసిన ఎమ్మెల్యేల జాబితా తయారు చేసుకున్న ఎడప్పాడి పళనిసామి వారి మీద చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారని తెలిసింది.
ఓపీఎస్, ఈపీఎస్ వర్గీయుల భేటీ !
దినకరన్ తన బలాన్ని పెంచుకోవడానికి ఎమ్మెల్యేలలో చీలిక తీసుకురావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గీయులు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు రహస్యంగా భేటీకి సిద్దం అయ్యారని తెలిసింది. అదే జరిగితే దినకరన్ కు చెక్ పెట్టే చాన్స్ పుష్కలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.