ఏపీ అక్వా రైతుల కోసం యాక్షన్ ప్లాన్: నిర్మలా సీతారామన్: రవాణా సహా సమస్యల పరిష్కారం కోసం.. !
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన రైతులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల మధ్య అక్వా రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వారిని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రానికి చెందిన అక్వా రైతులు లాక్డౌన్ వల్ల నష్టపోకుండా ఉండేలా చూస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనికోసం ఏపీ ప్రభుత్వ అధికారులను సంప్రదించడానికి కూడా వెనుకాడబోమని ఆమె భరోసా ఇచ్చారు.
కరోనా ప్యాకేజీని ప్రకటించడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశరాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి మాట్లాడారు. లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా నిరుపేదల, దినసరి వేతన కూలీలు, కార్మికులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, వారిని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. గోధుమల, బియ్యం వంటి నిత్యావసర సరుకులను అందజేస్తామని వెల్లడించారు.
Recommended Video
ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఓ విలేకరి.. అక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. అక్వా రైతుల సమస్యను ఆయన తెలుగులో ఆమెకు వివరించారు. దీనిపై నిర్మలా సీతారామన్ కూడా తెలుగులోనే సమాధానం ఇవ్వడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. తెలుగులోనే ప్రశ్న వేసినందుకు తాను తెలుగులోనే సమాధానాన్ని ఇస్తానంటూ ఆమె బదులిచ్చారు. లాక్డౌన్ వల్ల రవాణా స్తంభించిందని, ఫలితంగా ఏపీకి చెందిన అక్వా రైతులు ఇబ్బందులు పడుతోన్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీన్ని పరిష్కరించడానికి తక్షణ చర్యలను తీసుకుంటామని అన్నారు. అక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి తాను స్వయంగా ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోనులో మాట్లాడతానని తెలిపారు.