నిర్మలమ్మ పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపించారా? విశ్లేషకుల వాదనేంటీ? తక్షణ ప్రయోజనాలేవీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల వారిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పట్ల ఆర్థిక నిపుణలు పెదవి విరుస్తున్నారు. అన్నీ దీర్ఘకాలంలో ఉపయోగ పడేలా పథకాలను రూపొందించారని, తక్షణ ప్రయోజనాలను కల్పించేలా ఎలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదనే అభిప్రాయాలు, వాదనలు వినిపిస్తున్నాయి.
లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయి.. రోడ్డున పడిన కోట్లాది మంది వలస కార్మికులకు కల్పించిన తక్షణ ప్రయోజనం ఏమిటో అర్థం కావట్లేదని అంటున్నారు. వందల కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమిస్తూ.. దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు బయలుదేరిన వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించలేకపోయిందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బీజేపీయేతర పార్టీలతో పాటు పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు తరహా ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు వలస కార్మికుల కడుపు నింపబోవని అంటున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు చేరిన వలస కార్మికులకు కనీసం.. అక్కడైనా కడుపు నిండా ఆహారం లభిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం లేదని చెబుతున్నారు. ఎనిమిది కోట్ల మంది పేదలకు ఆహార భద్రతను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆ ఎనిమిది కోట్ల మందిని ఇప్పటికే గుర్తించారా? లేదా? ఎప్పటికి గుర్తిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్ రీతికా ఖేరా అన్నారు.
పేదలకు ఆహార భద్రత కింద నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి 3,500 కోట్ల రూపాయలను కేటాయించడం ఇప్పుడు చేయాల్సిన పని కాదని అంటున్నారు విశ్లేషకులు. ఈ నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం ఏర్పడిందని, ఈ మొత్తం సరిపోదనీ అంటున్నారు. లాక్డౌన్ ఆరంభంలోనే దీనికి సంబంధించిన పనులను పూర్తి చేసి ఉండాల్సిందని, ఉన్న వారికి ఉన్న చోటే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఉంటే.. వారికి ఈ ఇబ్బందులు వచ్చేవి కావని అంటున్నారు.
కేంద్రం తోపుడుబండ్ల వ్యాపారుల కోసం కేంద్రం ప్రకటించిన రుణ మొత్తం సరిపోదని అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లిబరల్ స్టడీస్ ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ భోసలే అన్నారు. వీధి వ్యాపారుల కోసం 5000 కోట్ల రూపాయలతో ప్రత్యేక రుణ సౌకర్యాన్ని కల్పించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు రుణం తీసుకోవాలని చెప్పడం సమస్యకు పరిష్కారం ఇస్తుందా అంటూ ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఈ ప్యాకేజీ వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శిస్తున్నాయి.