కమల్హాసన్ను ఏకేసిన పన్నీరుసెల్వం, సొంత ఖర్చుతో ఖుష్బూ
చెన్నై: తమిళ నటుడు కమల్ హాసన్ పైన ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటు పన్నీరు సెల్వం శనివారం నాడు మండిపడ్డారు. అతడు మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు తాపత్రయపడుతున్న వారి చేతిలో కీలుబొమ్మగా మారాడన్నారు.
చౌకబారు ప్రచారం కోసం కమల్ హాసన్ ఆరాటపడుతున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. భారీ వర్షం కారణంగా, వరద సహాయక చర్యల్లో జాప్యంపై కమల్ హాసన్ స్పందించారు. తాము కడుతున్న పన్నులన్నీ ఏమైపోతున్నాయని ప్రశ్నించాడు.
ఈ నేపథ్యంలో సాయం చేయాలని తాము ఎవరినీ అడగలేదని పన్నీరు సెల్వం గట్టి కౌంటర్ ఇచ్చారు. సామాజిక రంగం, విపత్తు నిర్వహణ కోసం ఎంత బడ్జెట్ కేటాయించామో తెలుసుకొని మాట్లాడుతే బాగుంటుందని మండిపడ్డారు.
చెన్నై నగరంలో ఒక్కరోజే 40 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయిందన్నారు. దీంతో వరదలు వచ్చాయ్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించే బదులు ఇష్టారీతిగా మాట్లాడటం విడ్డూరమన్నారు. కమల్ హాసన్ మాటలు అతని స్థాయికి తగినవి కాదన్నారు.
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైలో బాధితులను ఆదుకునేందుకు సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ కృషి చేస్తున్నారు. మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు.
పట్టినబాక్కంలో పదివేల మందికి ఆహారం తయారు చేసే సామర్థ్యం గల వంటశాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. శనివారం అక్కడ తయారు చేసిన ఆహారాన్ని, బ్రెడ్ ప్యాకెట్లను పెరియార్ నగర్లో దాదాపు రెండు వేల మంది వరద బాధితులకు అందించారు.