2 బడ్జెట్ల మంత్రి : పీయూష్ గోయల్ కు ఆర్థికశాఖ పగ్గాలు
Recommended Video
ఢిల్లీ : కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష్ కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోడీ సూచనతో ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి. అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన తిరిగి వచ్చేంతవరకు ఆర్థిక శాఖ బాధ్యతను పీయూష్ గోయల్ తీసుకోనున్నారు.
అరుణ్ జైట్లీ స్థానంలో ఆయనకు బదులు పీయూష్ గోయల్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రిపేరేషన్ లో తలమునకలయ్యారు. అయితే ప్రభుత్వం తాజా నిర్ణయంతో అరుణ్ జైట్లీకి బదులు ఆయన మరో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఫిబ్రవరి 1న లోక్సభలో పీయూష్ రెండింటికి సంబంధించి ఓటాన్ బడ్జెట్లు ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థికశాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీ కొంతకాలంగా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ మేరకు న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం నాడే ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తారని భావించినా... ఆరోగ్యం కుదుటపడక ఆయన రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అరుణ్ జైట్లీ బాధ్యతలను తాత్కాలికంగా పీయూష్ కు అప్పగించారు. అంతకముందు కూడా అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా బాధపడటంతో పీయూష్ కే బాధ్యతలు అప్పగించారు. ఆర్థికశాఖను తాత్కాలికంగా ఆయనకు అప్పజెప్పడం ఇది రెండోసారి.