స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడించడం కుదరదు: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్(స్విస్) బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడించాలంటూ సమాచారం హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. ఆ వివరాలు తాము సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది.
గోప్యంగా ఉంచాలన్న నిబంధనతో స్విట్జర్లాండ్తో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో తాము ఆ వివరాలను వెల్లడించడం కుదరదని తెలిపింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) వార్తా సంస్థకు చెందిన ఓ రిపోర్టరు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు వివరాలు తెలపాలంటూ దరఖాస్తు చేయడంతో ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది.
'రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉంది. అందువల్ల పన్ను సంబందిత వివరాలు, ఇతర దేశ ప్రభుత్వాల నుంచి వచ్చిన వివరాలు ఆర్టీఐలోని 8(1)(ఎఫ్) కింద మినహాయింపు ఉంది' అని ఆర్థిక శాఖ వివరించింది.
నల్లధనం దాచుకునేందుకు ఎక్కువగా భారత సంపన్నులు, రాజకీయ నాయకులు స్విస్ బ్యాంకులనే ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. నల్లధనం దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు స్వర్గధామాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, భారత ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో స్విస్ ప్రభుత్వం నల్లధనం దాచుకున్నవారి వివరాలు మనదేశానికి ఇచ్చేందుకు అంగీకరించింది.
భారత్ సహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్లో అక్కడి ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తొలి విడత సమాచారం మనదేశానికి చేరింది. ఈ జాబితాలో ఎక్కువగా మూసివేసిన ఖాతాల సమాచారమే ఉందని వార్తలు వచ్చాయి.